‘కవిత మామూలు మహిళ కాదు.. సో పవర్ ఫుల్’

ఢిల్లీ మద్యం కేసులో నిందితురాలిగా ప్రస్తుతం జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయటం.. తనకు సాధారణ మహిళలకు ఉండే హక్కుల్ని కల్పించాలని కోరుతూ తన తరఫు లాయర్ చేత వాదనలు వినిపించటం తెలిసిందే.

ఈ వాదనకు కౌంటర్ గా సీబీఐ.. ఈడీల తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సాధారణ మహిళ కాదని.. ఆమె చాలా శక్తివంతురాలన్న విషయాన్ని ఈడీ.. సీబీఐ వెల్లడించింది. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.

ఈ సందర్భంగా కవిత పవర్ గురించి చెబుతూ.. ‘‘ఈడీ సమన్లు జారీ చేసిన రెండు రోజుల్లోనే ఆమె నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారు. ఆమె సాధారణ గ్రహిణి కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి కుమార్తె. విదేశాల్లో ఫైనాన్స్ లో మాస్టర్స్ చేసి వచ్చి రాజకీయాల్లో ఉన్నత స్థానాలు చేపట్టిన వ్యక్తి. అన్నీ తెలిసి తప్పు చేసిన వారికి బెయిల్ ఇవ్వరాదు. లిక్కర్ కుంభకోణంలో నిందితులుగా ఉన్న బుచ్చిబాబు.. అరుణ్ పిళ్లైలను బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేలా కవిత ఒత్తిడి చేశారు. మద్యం కుంభకోణంలో కవిత బినామీగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఈ కేసులో ఆమె పాత్ర గురించి ఈడీ ముందు వాంగ్మూలాన్ని ఇచమచారు. ఆ తర్వాత తన వాంగ్మూలాన్ని 118 రోజుల తర్వాత ఉపసంహరించుకున్నారు’’ అని చెప్పారు.

కవిత పేరును ఉపసంహరించుకోవటం వెనుక ఆమె పాత్ర ఉన్న విషయాన్ని ప్రస్తావించిన విచారణ సంస్థల న్యాయవాదులు.. ఈ స్కాం సాగిన 10 నెలల్లోనే హోల్ సేల్ వ్యాపారులు మొత్తం రూ.338 కోట్ల నేరపూరితంగా ఆర్జించినట్లుగా పేర్కొన్నారు. అందులో ఇండో స్పిరిట్ సంస్థ ఒక్కదానికే రూ.192 కోట్లు దక్కించుకుందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇదే సంస్థలో అరుణ్ పిళ్లై కవిత బినామీగా ఉంటూ.. ఆమె తరఫున రూ.32 కోట్లు పొందారని పేర్కొన్నారు. ఈ విషయం బుచ్చిబాబు తన వాంగ్మూలంలో పేరర్కొన్నారు.

గత ఏడాది మార్చిలో తొమ్మిది ఫోన్లను దర్యాప్తు అధికారులకు అప్పగించారని.. అందులో నాలుగు ఫోన్లు ఫార్మాట్ చేసిన విషయాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఇలా సాక్ష్యాల్ని చెరిపేశారన్న కారణంగానే కింది కోర్టు బెయిల్ నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తనకు ఇచ్చిన వాగ్దాదాన్ని ఉల్లంఘించి తాము అరెస్టు చేశామన్న ఆమె వాదనల్లో ఎలాంటి నిజం లేదన్నారు.

‘‘వచ్చే పది రోజులు ఆమెకు సమన్లు జారీ చేయబోమని మాత్రమే గత ఏడాది సెప్టెంబరు 15న ఏఎస్జీ రాజు సుప్రీంకోర్టుకు చెప్పారు. అంతే తప్పించి అరెస్టు చేయబోమని చెప్పలేదు’’ అంటూ ఈడీ తరఫు లాయర్ తన వాదనలు వినిపించారు. సీబీఐ తరపు న్యాయవాది సైతం ఇదే తరహాలో తన వాదనలు వినిపిస్తూ ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వుచేస్తూ ఈ నెల 30, 31లలో ఏదో ఒక రోజు తీర్పును వెలువరించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాటు సీఎంగా ఉన్న కేసీఆర్.. తనకు అనుకూలంగా వ్యవహరించేందుకు వీలుగా హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిన వైనం వెలుగు చూడటం.. ప్రతికూల పరిస్థితులకు దారి తీయొచ్చన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.