రేవ్ పార్టీ వ్య‌వ‌హారం మంత్రికి తెలుసా? లేదా?

దక్షిణాది రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన బెంగ‌ళూరు రేవ్ పార్టీ మూలాలు ఏపీలో ఉన్నాయ‌ని.. బెంగ‌ళూరు పోలీసులు భావించిన‌ట్టే జ‌రుగుతోంది. ఈ రేవ్ పార్టీలో తొలిరోజే… మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి స్టిక్క‌ర్ ఉన్న కారును పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అయితే.. దీనిపై రాజ‌కీయం రేగ‌డంతో కాకాని స‌వాళ్లు రువ్వారు. అది త‌న కారు కాద‌న్నారు. త‌న‌కు త‌న అనుచ‌రుల‌కు కూడా.. ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పారు. కానీ..ఇ ప్పుడు పోలీసులు తీసుకున్న చ‌ర్య‌ల త‌ర్వాత‌. కాకాని అడ్డంగా బుక్క‌య్యార‌నే వాద‌న వినిపిస్తోంది.

బెంగళూరు రేవ్ పార్టీ కేసును సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) పోలీసులు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. తెలంగాణ‌, ఏపీల్లోనూ వారు దర్యాప్తు చేస్తున్నారు. రేప్ పార్టీ నిర్వహించిన వారిలో ప్రధాన నిందితుడు వాసు ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన‌న వ్య‌క్తిగా గుర్తించారు. ఈయ‌నను ఏ1గా పేర్కొన్నారు. ఇక‌, ఏ3గా మ‌రో వ్య‌క్తిని పేర్కాన్నారు. ఈయ‌నే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి అనుచ‌రుద‌ని చెబుతున్నారు. అదేవిధంగా ఈయ‌న‌కు వైసీపీ నేత‌ల‌తోనూ సంబంధాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కారును సీజ్ చేసిన పోలీసులు.. ఆ స్టిక్క‌ర్ ఆధారంగా ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. దీనిలో భాగంగా హైదరాబాద్ కు చెందిన పూర్ణారెడ్డి అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించారు. ఈయ‌న గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి అనుచ‌రుడ‌ని.. నెల్లూరుకు దూరంగా ఉంటున్నా.. మంత్రితో క‌లిసే ప‌నిచేస్తున్నా ర‌ని తెలిపారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లోనూ మంత్రికి నిధులు స‌మ‌కూర్చిన‌ట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. రేవ్ పార్టీ వ్య‌వ‌హారం మంత్రికి తెలుసా? లేదా? అనే విష‌యంపై కూపీ లాగుతున్న‌ట్టు పేర్కొన్నారు.

అలానే.. ఏ2గా ఉన్న అరుణ్ కుమార్‌కు కూడా.. వైసీపీ కీల‌క నేత‌, రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డికి ముఖ్య అనుచ‌రుడిగా గుర్తించారు. రేవ్ పార్టీ మొత్తం ఈయ‌న క‌నుస‌న్న‌ల్లోనే సాగింద‌ని.. ఆహ్వానాలు పంపించింది కూడా.. ఈయ‌నేన‌ని పోలీసులు భావిస్తున్నారు. అరుణ్ కుమార్ సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరంద‌రికీ ర‌క్త‌న‌మూనాల్లో డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టు నివేదిక‌లు వ‌చ్చిన‌ట్టు తెలిపారు. మొత్తానికి లేద‌లేద‌న్నా కూడా.. డ్ర‌గ్స్ పార్టీలో మంత్రి కాకాని, వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి అనుచ‌రులు అడ్డంగా బుక్క‌వ‌డంతో రాజ‌కీయంగా ఇది ప్రాధాన్యం సంత‌రించుకుంది.