హైదరాబాద్‌తో ఏపీ రుణం తీరిపోయింది

హైదరాబాద్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు రాజధానే అన్న విషయం చాలామంది మరిచిపోయే ఉంటారు. ఉమ్మడి రాష్ట్రాన్ని రెండుగా విభజించిన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ చట్టంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఐతే 2014లో రాష్ట్రం విడిపోయాక రకరకాల కారణాల వల్ల ఏడాది తిరక్కుండానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయింది. కొంత కాలానికే 90 శాతం ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్‌ నుంచి అమరావతి, ఇతర ఏపీ నగరాలకు తరలిపోయాయి.

కానీ 10 శాతం కార్యాలయాలు ఇంకా హైదరాబాద్‌లోనే కొనసాగుతున్న సంగతి చాలామందికి తెలియదు. ఐతే వాటికి కూడా ఇప్పుడు హైదరాబాద్‌తో రుణం తీరిపోయింది. జూన్ 2తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల గడువు తీరిపోనుంది.

ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2 తారీఖున ముగియనుంది. దీంతో హైదరాబాద్‌లోనే కొనసాగుతున్న కొన్ని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలను ఏపీకి మార్చక తప్పని పరిస్థితి. 2016లో 90% కార్యాలయాలు తెలంగాణ నుండి ఏపీకి మారగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రధాన కార్యాలయం సహా మరి కొన్ని ఆఫీసులను ఏపీకి మారుస్తున్నారు.

జూన్ 2 లోపు హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న భవనాలన్నింటినీ ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయాన్ని కర్నూలుకు మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో ఒకటైన కర్నూలుకు ఈ ఆఫీసును మార్చాలని ఆదేశాలు జారీ చేశారు.

దీని కంటే ముందే జూన్ 2లోపు అన్ని భవనాలనూ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని కూడా సీఎం ఆదేశాలిచ్చారు. ఒకవేళ ఏపీలో ప్రభుత్వం మారితే.. ఆయా కార్యాలయాలను ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తానికి జూన్ 2 నాడు హైదరాబాద్‌తో ఏపీకి రుణం తీరిపోనుందన్నమాట.