పోలింగ్ స‌రే.. ఇది మ‌రీ టెన్ష‌న్‌.. !

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ ముగిసింది. అయితే.. దాని తాలూకు ప‌ర్య‌వ‌సానం.. దాడులు.. హింస వంటివి కొన్నేళ్ల వ‌ర‌కు కూడా రాష్ట్రాన్ని వెంటాడ‌నున్నాయి. అంటే.. ఆయా కేసుల్లో ఇరుక్కున్న నాయ‌కులు.. చేసిన నేత‌లు.. అందరూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సో.. పోలింగ్ వ్య‌వ‌హారం.. ఇలా టెన్ష‌న్ రేపింది. ఇక‌, ఇప్పుడు మ‌రో కీల‌క విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. అదే.. కౌంటింగ్‌. వ‌చ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంటు స్థానాల‌కు కూడా ఒకేసారి కౌంటింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ ప్ర‌క్రియ మ‌రింత టెన్ష‌న్ గా మార‌నుంద‌నేది అధికార వ‌ర్గాల అంచ‌నాగా ఉంది. దీనికి కార ణం.. ఎక్క‌డిక‌క్క‌డ ఎవ‌రికి వారు ధీమా పెంచేసుకోవ‌డ‌మే. ఒక‌ప్పుడు ఎన్నిక‌లు అన‌గానే.. గెలుపు-ఓట‌ముల‌ను స‌మపాళ్ల‌లో తీసుకునేవారు. గెలిస్తే… సంబ‌రాలు చేసుకునే వారు. ఓడితే మౌనంగా ఉండి.. వేరే ప్రాంతానికి వెళ్లి ఆ బాధ‌ను మ‌రో రూపంలో తీర్చుకునే వారు. త‌ర్వాత ప‌రిస్థితి స‌ర్దుమ‌ణిగింది.

అయితే.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. ముఖ్యంగా ఏపీలో అయితే.. మ‌రింత ఎక్కువ‌గా బెట్టింగులు.. పందేలు.. పంతాలు.. ప‌ట్టింపులు ఇలా.. లెక్క‌లేన‌న్ని అంశాలు నాయ‌కుల‌కు-నాయ‌కుల‌కు, పార్టీల‌కు-పార్టీల‌కు మ‌ధ్య టెన్ష‌న్ పెట్టేస్తున్నాయి. దీనికి తోడు 32 నియోజ‌క‌వ‌ర్గాలు స‌మ‌స్యాత్మ‌కంగా గుర్తించారు. ఇక‌, మ‌రో 20 నియోజ‌క‌వ‌ర్గాలు అత్యంత స‌మ‌స్యాత్మ‌కంగా ఉన్నాయి. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేది అంచ‌నా కు కూడా అంద‌డం లేదు.

వాస్త‌వానికి ర‌గ‌డ‌లు జ‌రుగుతాయని అంచ‌నా వేసిన అనంత‌పురం, ప‌ల్నాడు, చిత్తూరు వంటి నియోజ‌కవర్గాల‌లోనే వాటిని నిలువ‌రించ‌లేక పోయారు. అంతా అయిపోయిన త‌ర్వాత చ‌ర్య‌లు తీసుకున్నారు. అయినా అవి ఒక ప‌ట్టాన అదుపులోకి రాలేదు. ఎన్నిక‌ల పోలింగ్‌తో పోలిస్తే.. కౌంటింగ్ రోజు మ‌రింత తీవ్ర‌మైన ప‌రిస్థితి ఉంటుందన‌డంలో సందేహం లేదు. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో 2019లో కౌంటింగ్ రోజు త‌ల‌లు ప‌గుల‌గొట్టుకున్నారు. ఇలాంటివి ఇప్పుడు మ‌రిన్ని పెరిగే అవ‌కాశం ఉంది. దీనికి ప‌రిష్కారం పోలీసులు.. వ్య‌వ‌స్త కాదు. పార్టీల అధినేత‌లే. వారే కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు కూడా పిలుపునిస్తే.. కొంత వ‌ర‌కు ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు చెక్ పెట్టే అవ‌కాశం ఉంటుంది. లేక‌పోతే.. మ‌రింత రెచ్చిపోవ‌డం ఖాయం.