జూన్ 6 వరకు పిన్నెల్లికి హైకోర్టు ఊరట

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి పోలింగ్ స్టేషన్ లో దౌర్జన్యంగా ఈవీఎంను బద్దలు కొట్టిన వైనం షాకింగ్ గా మారింది ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి అరెస్టుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు పిన్నెల్లిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. పిన్నెల్లిని అరెస్టు చేయవద్దని, ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు రాష్ట్రంలోని మిగతా చోట్ల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల మందస్తు బెయిల్ పిటిషన్ల విషయంలో కూడా ఈ ఆదేశాలు పాటించాలని హైకోర్టు క్లారిటీనిచ్చింది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డిలకు కూడా ఇవే ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

అయితే, వీరిద్దరిలో ఏ ఒక్కరూ తాడిపత్రికి వెళ్ళకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఎటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడకుండా ఉండాలని హైకోర్టు షరతులు విధించింది. అంతేకాకుండా ఈ ఇద్దరు నేతల కదలికలపై నిఘా ఉంచాలని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఇద్దరు అభ్యర్థులతో నలుగురికి మించి తిరగకూడదని కండిషన్ పెట్టింది. వీరిద్దరిని జూన్ ఆరో తేదీ వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నెల 13న ఘటన జరిగితే 15న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అని ముందు పేర్కొని, ఆ తర్వాత లోకేష్ ట్విట్టర్ వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుందని నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వీడియోలో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని, ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని నిరంజన్ రెడ్డి కోరారు. సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉంటే 41ఏ నోటీసులు ఇవ్వాలని ఉన్నట్లుగా కోర్టులో వాదనలు వినిపించారు.