అప్పుడు తొడ‌కొట్టారు.. ఇప్పుడు అపాయింట్‌మెంట్ అడిగారు!

ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ముఖ్యంగా రాజ‌కీయాల్లో మాత్రం ఎప్పుడూ త‌న‌దే అధికారం అని అనుకోవ‌డానికి లేదు. ఎన్నిక‌లు వ‌చ్చేంత‌వ‌ర‌కే ఏదైనా. ఒక్క‌సారి ప్ర‌జ‌లు ఓటుతో కొడితే ఎక్క‌డికో వెళ్లిప‌డాల్సిందే.

నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు నా ముందు నువ్వెంత‌, రా చూసుకుందాం అంటూ రేవంత్ రెడ్డిపై మ‌ల్లారెడ్డి తొడ కొట్టారు. క‌ట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం తిరుగుతున్నార‌ని తెలిసింది.

మూడోసారి కూడా తెలంగాణ‌లో బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించి మ‌ల్లారెడ్డి లేనిపోని స‌వాళ్లు విసిరారు. రేవంత్‌ను ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. కానీ సీన్ రివ‌ర్స్ అయింది. ఆయ‌న గెలిచారు స‌రే కానీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కూలిపోయింది. రేవంత్ సీఎంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్లో చేరేందుకు మ‌ల్లారెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నార‌నే ప్ర‌చార‌మూ జోరందుకుంది.

ఇక ఇప్పుడేమో భూ క‌బ్జా విష‌యంలో సీఎం రేవంత్‌ను క‌లిసేందుకు మ‌ల్లారెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిసింది. సుచిత్ర వ‌ద్ద ఉన్న భూ వివాదంలో మ‌ల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య తీవ్రమైన పోరు న‌డుస్తోంది. ఈ వివాదంలో ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

కావాల‌నే కాంగ్రెస్ ఎమ్మెల్యే త‌న‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని, ఈ భూమి త‌న‌దేన‌ని మ‌ల్లారెడ్డి మ‌రోసారి చెప్పారు. సీఎం అపాయింట్‌మెంట్ అడిగాన‌ని, రేవంత్‌ను క‌లిసి అన్ని విష‌యాలు తేల్చుకుంటాన‌ని మ‌ల్లారెడ్డి ప్ర‌క‌టించారు. నేడో రేపో రేవంత్‌ను మ‌ల్లారెడ్డి కలిసే అవ‌కాశ‌ముంది.