ఈవీఎం బద్దలు కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి..వైరల్

ఏపీలో పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు అనేక దారుణాలకు తెగబడ్డారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి. అయితే, టీడీపీ నేతలే తమపై దాడి చేశారని వైసీపీ నేతలు బుకాయిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలింగ్ నాడు పిన్నెల్లి రౌడీయిజానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మాచర్ల నియోజకవర్గంలోని పాలువాయి గేటులోని పోలింగ్ కేంద్రం(పోలింగ్ స్టేషన్ నెంబర్ 202)లోకి ప్రవేశించి ఈవీఎంను స్వయంగా పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఇపుడు వెలుగులోకి వచ్చింది.

పిన్నెల్లిని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ ను ఆయన, ఆయన అనుచరులు బెదిరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టిన దృశ్యాలు స్పష్టంగా ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించడంతో అక్కడ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. దీంతో, ఈ వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజిలో రికార్డయింది. అది ఈ రోజు వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాచర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఘాటుగా స్పందించారు. పిన్నెల్లీ… నువ్వు ప్రజాప్రతినిధివా, లేక వీధి రౌడీవా? అంటూ జూలకంటి మండిపడ్డారు. పోలింగ్ బూత్ లోకి చొరబడి అధికారుల ముందే అడ్డగోలుగా రౌడీ మాదిరి ఈవీఎంను పగులగొడుతున్న పిన్నెల్లి తాను బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధి అన్న సంగతి మరచిపోయారని, ఓటమి తాలూకు భయం ఆయన నరనరాన జీర్ణించుకుపోయిందని జూలకంటి అన్నారు.

పోలీసు, న్యాయ వ్యవస్థలు ఏమీ చేయలేవన్న భరోసాతో ఇలా చేసి ఉంటాడని, ప్రజాకోర్టులో ఇచ్చే తీర్పు నుండి మాత్రం తప్పించుకోలేడని చెప్పారు. ప్రతి రోజూ సత్యహరిశ్చంద్రుడి కజిన్ బ్రదర్ లా పోజులు కొడుతూ చెప్పే మాటలన్నీ అసత్యాలని ప్రజలు ఏనాడో తెలుసుకున్నారని జూలకంటి అన్నారు. పిన్నెల్లిపై ఈసీ చర్యలు తీసుకొని అతడిని డిస్క్వాలిఫై చేయాలని జూలకంటి డిమాండ్ చేశారు.