నోరు జారానా? ముద్ర‌గ‌డ అంత‌ర్మ‌థ‌నం..!

కాలు జారితే తీసుకోవ‌చ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవ‌డం క‌ష్టం. పైగా ఇది ప‌రువు, ప్ర‌తిష్ట‌ల‌కు కూడా సంబంధించిన విష‌యంగానే మెజార‌టీ మ‌నుషులు భావిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ఒక ఉన్న‌త స్థాయిలో .. ఉన్న‌తంగా భావించిన వారు.. ఒకింత జాగ్ర‌త్త‌గానే నోరు వాడ‌తారు. రాజ‌కీయాల్లో ఉంటే.. ఆ లెక్క వేరు. ఈ రోజుతిట్టుకుని.. రేపు క‌లుసుకుంటారు. అయితే..ఇక్క‌డ కూడా కొంద‌రు కీల‌క నాయ‌కులు ఉంటారు. వారు మాత్రం ఆచి తూచి మాట్లాడతారు. ఒక్క మాట మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచిం చుకుంటారు.

ఇలాంటి వారిలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఒక‌రు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయ‌న నాలుగుద‌శాబ్దాల‌కు పైగానే అజాత శ‌త్రువుగానే ఉన్నారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల కూడా ఈయ‌న ఇంటికి వ‌చ్చిన సంద‌ర్భాలు, క‌లిసి భోం చేసిన‌సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు అంత‌ర్మ‌థ‌నంలో పడిపోయార‌ని పిఠాపురంలో టాక్‌న‌డుస్తోంది. ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లకు కొద్ది రోజుల ముందు.. “పవన్‌ కల్యాణ్‌ను ఓడిస్తా… ఓడించ‌క‌పోతే నా పేరు మార్చుకుంటా” అని శపథం చేసిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు.. ‘ప‌ద్మ‌నాభ రెడ్డి’గా మార్చుకుంటాన‌ని కూడా ముద్ర‌గ‌డ అన్నారు. ఈయ‌న ఆవేశంతో అన్నా రో.. ఆగ్ర‌హంతో అన్నారో.. లేక వైసీపీ పిఠాపురంలో గెలుస్తుంద‌ని న‌మ్మారో మొత్తానికి అయితే అనేశారు. ప‌వ‌న్ ఓడిస్తాన‌ని చెప్పారు. క‌ట్ చేస్తే.. ఎన్నిక‌ల రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పిఠాపురంపై ఒక్క‌టంటే ఒక్క స‌ర్వే కానీ.. విశ్లేష‌ణ కానీ..యాంటీగా రాలేదు. ముఖ్యంగా ప‌వ‌న్‌కు నెగిటివ్‌గా కూడా.. ఎవ‌రూ విశ్లేషించ లేదు. క‌ర‌డు గట్టిన వైసీపీ అభిమానులు కూడా ప‌వ‌న్ ఓడిపోతార‌ని చెప్ప‌లేదు.

కేవ‌లం ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని మాత్ర‌మే అంద‌రూ చెబుతున్నారు. దీనికితోడు.. ఓటింగ్ శాతం కూడా.. భారీగా పుంజుకుంది. 86.63 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఊహించ‌ని ప‌రిణామం కావ‌డంతో అంద‌రూ.. లెక్క‌లు స‌రిచూసుకుంటున్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో 70 వేలకు పైబడి ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లతోపాటు ఎస్సీ, బీసీలు అంతా పవన్‌ కల్యాణ్‌కు ఓటువేశారని, ఈ సారి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పవన్‌ కల్యాణ్‌ గెలవబోతున్నారని పెద్ద ఎత్తున పందేలు కూడా క‌డుతున్నారు.

దీంతో ముద్ర‌గ‌డ అంత‌ర్మ‌థ‌నంలో ప‌డిపోయార‌ని తెలుస్తోంది. అన‌వ‌స‌రంగా నోరు జారానా? అని ఆయ‌న చింతిస్తున్నార‌ని.. పిఠాపురం టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే.. ముద్ర‌గ‌డ అంత ప్ర‌తిజ్ఞ చేసిన త‌ర్వాత‌.. వైసీపీ నుంచి ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. ఇక‌, ఆయ న కుమార్తె ఎదురు దాడి చేసిన‌ప్పుడు కూడా.. వైసీపీఅగ్ర‌నేత‌ల నుంచి ఎలాంటి సానుభూతి క‌నిపించ‌లేదు. ఈ ప‌రిణామాలు కూడా ముద్ర‌గ‌డ‌ను ఇప్పుడు మాన‌సికంగా వేధిస్తున్నాయ‌ని అంటున్నారు. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.