విదేశీ పర్యటన: జగన్, చంద్రబాబు.. ఇద్దరి మధ్యా తేడా ఇదీ.!

YS-Jagan-Chandrababu-Naidu

ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్‌కి ముందు.. కొంత ఉపశమనం కోసం ప్రయత్నిస్తే, అది తప్పెలా అవుతుంది.? పుణ్యక్షేత్రాల సందర్శన, విదేశాలకు పయనం.. ఇలాంటివాటిని మామూలుగా అయితే తప్పు పట్టే పరిస్థితి లేదు.

కాకపోతే, గతంలో చేసిన అడ్డగోలు ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, రాజకీయాల్లో ప్రతీదీ కౌంట్‌లోకి వస్తుంది.! పైగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తప్పనిసరన్న విషయం ప్రతిసారీ ట్రోలింగ్‌కి గురవుతూనే వుంది. ఈసారీ అంతే.

కోర్టు నుంచి అనుమతి కోరడం, ‘అనుమతివ్వొద్దు’ అని సీబీఐ.. కోర్టు ముందర చెప్పడం.. చివరికి కోర్టు నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి రావడం.. ఇదంతా ఓ ప్రసహనం. ప్రతిసారీ జరిగే తంతే. ఈ క్రమంలో సహజంగానే రాజకీయ విమర్శలు, పొలిటికల్ ట్రోలింగ్ జరుగుతుంటాయ్.

వైఎస్ జగన్ విదేశీ పర్యటన వ్యవహారమిది. తాను ట్రోలింగ్‌కి గురవుతున్నాను కాబట్టి, అంతకు మించిన ట్రోలింగ్ చంద్రబాబు మీద చేయించాలని వైఎస్ జగన్ అనుకుంటారో, స్వామి భక్తి చాటుకునేందుకు వైసీపీ అనుకూల మీడియా అతి చేస్తుంటుందోగానీ, ‘చంద్రబాబు విదేశాలకు పారిపోతున్నారు’ అంటూ కథనాలు తెరపైకొస్తున్నాయి.

విదేశాలకు వెళ్లేందుకోసం చంద్రబాబు, ఏ న్యాయస్థానాన్నీ అనుమతులు కోరాల్సిన పనిలేదు. ‘జగన్ వెళితే, పారిపోవడం.. చంద్రబాబు వెళితే పర్యటన..’ అని ప్రశ్నించే క్రమంలో, వైసీపీ అనుకూల మీడియా, తమకు తెలియకుండానే చంద్రబాబుని ట్రోల్ చేస్తుండడం గమనార్హం.

విదేశీ పర్యటనలు – వైఎస్ జగన్, చంద్రబాబు మధ్య తేడా అర్థమయ్యింది కదా.?