కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టి నేత‌లు ప‌రార్‌.!

ఏపీలో రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరిగాయి. ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన ఈ నెల 13న, ఆ రోజు త‌ర్వాత కూడా.. ప‌ల్నాడు, అనంత‌పురం, తిరుప‌తిజిల్లాల్లో హింస చెల‌రేగింది. వైసీపీ, టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కు లు కూడా రెచ్చిపోయి దాడులు చేసుకున్నారు. ఆయా ఘ‌ట‌న‌ల్లో ప‌లువురు గాయాల పాల‌య్యారు. మ‌రికొంద‌రు త‌న్నులు కూడా తిన్నారు. రాళ్ల వ‌ర్షాలు.. క‌ర్ర‌ల కుమ్ములాట‌లు కామ‌న్ అయిపోయాయి. అయితే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

ఇప్పుడు కీల‌క‌మైన ఘ‌ట్టం తెర‌మీదికి వ‌చ్చింది. ఆయా జిల్లాల్లో జ‌రిగిన పోస్ట్‌పోల్ అరాచ‌కాల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. అత్యంత వేగంగా ప‌రిశీల‌న చేసి.. బాధ్యుత‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. దీనిపై వెంట‌నే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని కూడా నియ‌మించాల‌ని ఆదేశించింది. దీంతో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ద‌ర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు.

మొత్తం 13 మంది సీనియ‌ర్ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి.. ఆయాజిల్లాల్లో ప‌రిశీల‌న‌, ప‌రిశో ధ‌న చేస్తున్నారు. శ‌నివారం అర్ధ‌రాత్రి నుంచి జ‌రుగుతున్న ఈ ప‌రిశీల‌న‌ల్లో.. అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని త‌మ‌దైన శైలిలో విచారిస్తున్నారు. అయితే..ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఈ దాడుల ను ప్రోత్స‌హించిన వైసీపీ, టీడీపీ కీల‌క నాయ‌కులు.. త‌ప్పించేసుకున్నారు. ఇత‌ర ప్రాంతాల‌కు ప‌రార య్యారు.

కానీ, అమాయ‌క కార్య‌క‌ర్త‌లు మాత్రం ప్ర‌స్తుతం పోలీసుల చేతుల్లో చావు దెబ్బ‌లు తింటున్నారు. పార్టీలు ఏవైనా.. కార్య‌క‌ర్త‌ల‌ను ఇరికించేసి.. నాయ‌కులు త‌ప్పించుకోవ‌డం ప‌ట్ల ఆయా కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌లోని వారు గ‌గ్గోలు పెడుతున్నారు. అనంత‌పురంలో వైసీపీ కార్యాల‌యం ముందు కార్య‌క‌ర్త‌ల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేయ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ప‌ల్నాడులోని ఎమ్మెల్యే కార్యాల‌యం ముందు కూడా కొంద‌రు కార్య‌క‌ర్త‌ల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న నిర్వ‌హించారు.