“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి పోటీ చేసిన టీడీపీ నాయ‌కుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు చెప్పారు. ఓట‌మి భ‌యం ఆ పార్టీ నేత‌ల్లో మామూలుగా లేద‌న్నారు. త‌న‌కు చాలా మంది ట‌చ్‌లో ఉన్నార‌న్న ఆయ‌న వారితో మాట్లాడిన‌ప్పుడు.. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా అయినా ద‌క్కుతుందా? అన్న ఆందోళ‌న‌లో ఉన్నార‌ని తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ర‌ఘురామ‌.. రాష్ట్రంలో కూట‌మి గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని తెలిపారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఇమేజ్ బాగా ప‌నిచేసింద‌న్నారు.

దీనిని చ‌ర్చ‌కురాకుండా చేసేందుకే వైసీపీ ప‌న్నాగాలు ప‌న్నుతోంద‌ని ర‌ఘురామ విమ‌ర్శించారు. వైసీపీలో ఓట‌మి భయం ఉంద‌ని, అందుకే ప‌లు ప్రాంతాల్లో ఎన్నిక‌ల పోలింగ్ త‌ర్వాత‌.. హింస‌కు పాల్ప‌డింద‌ని చెప్పారు. “నోరు అబ‌ద్ధం చెప్పినా.. క‌ళ్లు మాత్రం నిజ‌మే చెబుతాయి. ఈ విష‌యం స‌జ్జ‌ల క‌ళ్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది” అని ర‌ఘురామ పేర్కొన్నారు. గ‌తంలో జ‌రిగిన 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి అనూహ్య విజ‌యం వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని .. దీనిని ఎవ‌రూ ఊహించ‌లేద‌ని చెప్పారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఆ ప‌రిస్థితి ఉండ‌బోద‌న్నారు. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు.

ఉద్యోగులు వైసీపీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. అప్పుడు జ‌గ‌న్‌ను ఇంటికి పంపించాల‌ని నిర్ణ‌యిం చుకున్నార‌ని.. వారు ఈ ఎన్నిక‌ల్లో త‌మ త‌డాఖా చూపించార‌ని ర‌ఘురామ తెలిపారు. ఎన్నిక‌ల సంఘం లెక్క‌ల ప్ర‌కార‌మే.. ఉద్యోగుల ఓట్లు దాదాపు 88 శాతం న‌మోదైన‌ట్టు తెలుస్తోంద‌న్నారు. ఇది పూర్తిగా కూట‌మికి అనుకూలంగా నే ప‌డింద‌ని చెప్పారు. చివ‌ర‌కు సీఎం జ‌గ‌న్ పోటీలో ఉన్న పులివెందుల‌లో కూడా.. ఫైట్ మామూలుగా లేద‌ని ర‌ఘురామ తెలిపారు. పుంగ‌నూరులోనూ పెద్దిరెడ్డికి ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయ‌ని, చీపురుప‌ల్లిలో బొత్స స‌త్య‌నారాయ‌ణ గెలుపుపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ఉంద‌ని.. ఇవ‌న్నీ.. వారిని చూస్తేనే అర్ధ‌మ‌వుతుంద‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు.