తాడిప‌త్రిలో ఉండొద్దు.. జేసీ ఫ్యామిలీని షిఫ్ట్ చేసిన పోలీసులు

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రిలో ఎన్నిక‌ల అనంత‌రం తీవ్ర హింస చెల‌రేగింది. ఇక్క‌డ పోటీలో ఉన్న జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు అస్మిత్ రెడ్డి వ‌ర్సెస్ వైసీపీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మ‌ధ్య తీవ్ర వివాదాలు ముదిరాయి. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. మంగ‌ళ‌వారం రాత్రి నేరుగా పోలీసులే జేసీ వ‌ర్గాన్ని బెదిరించి.. లాఠీల‌తో కొట్టార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో పోలీసులు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ‘తాడిప‌త్రిలో ఉండొద్దు’- అంటూ జేసీ ఫ్యామిలీని ఇక్క‌డ నుంచి పంపించి వేశారు. జేసీ కుటుంబం మొత్తాన్నీ బ‌లవంతంగా హైద‌రాబాద్‌కు షిఫ్ట్ చేశార‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చ‌ల్లారాలంటే జేసీ ఫ్యామిలీ ఇక్క‌డ ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో నే తాము త‌ర‌లించిన‌ట్టు పోలీసులు కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు హైదరాబాద్‌కు పంపేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక‌, ఆయ‌న‌ భార్య, సోదరి కూడా అనారోగ్యంతో ఆసుప‌త్రిలో ఉన్నారు. మిగిలిన వారిని వెంట‌నే హైద‌రాబాద్‌కు పంపేశారు. అయితే.. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ఉన్న దివాక‌ర్ రెడ్డి కుమారుడు ప‌వ‌న్ కుమార్‌.. తాడిప‌త్రికి వ‌చ్చారు. కానీ.. ఆయ‌న‌ను క‌నీసం కారు కూడా దిగ‌కుండానే.. తిరుగు ట‌పాలో వెన‌క్కి మ‌ళ్లించారు. మొత్తంగా చూస్తే. దివాక‌ర్ రెడ్డి ఇంటిని పోలీసులు దాదాపు త‌మ అధీనంలోకి తీసుకున్న‌ట్టు అయింది.

పెద్దారెడ్డి ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది. హింస‌కు ఇరు ప‌క్షాలు కార‌ణ‌మ‌ని పోలీసులు చెబుతున్న నేప‌థ్యంలో ఒక వ‌ర్గం వారిని మాత్ర‌మే హైద‌రాబాద్‌కు త‌ర‌లించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా యి. వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే కావ‌డంతోనే పెద్దారెడ్డిని ప‌క్క‌న పెట్టారా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. మొత్తంగా చూస్తే.. తాడిప‌త్రిలో త‌న్నులాట‌లు.. కుమ్ములాట‌లు అయితే.. ఇంకా అదుపులోకి రాక‌పోవ‌డం.. ఇక్క‌డి ఎస్పీ, డీఎస్పీల‌ను కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌స్పెండ్ చేయ‌డం వంటివి సంచ‌ల‌నంగా మారాయి.