పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

Chandrababu

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ దాడుల‌ను నియంత్రించ‌డంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ మేర‌కు ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డికి చంద్ర‌బాబు ట్వీట్ రూపంలో త‌న ఆవేద‌న్ని తెలిపారు. వైసీపీ రౌడీల దాడుల‌ను పోలీసులు చోద్యం చూసిన‌ట్టు చూశార‌ని నియంత్రించ‌లేక పోయార‌ని పేర్కొన్నారు.

ఇప్పుడు హింసా రాజ‌కీయాలు విశాఖ‌ప‌ట్నానికి కూడా పాకాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఎన్నిక‌ల వేళ తాము ఇచ్చిన డ‌బ్బులు తీసుకోకుండా.. టీడీపీకి ఓటేశార‌న్న ఒకే ఒక్క కార‌ణంగా ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం లోని ఓ కుటుంబంపై వైసీపీ మూక‌లు దాడులు చేశార‌ని చంద్ర‌బాబు తెలిపారు. బాధితుల్లో మ‌హిళ‌లు కూడా ఉన్నార‌ని పేర్కొన్నారు. ఏం జ‌రిగినా ఏమ‌వుతుందిలే! అన్న‌ట్టు పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు కార‌ణంగా వైసీపీ రౌడీలు రెచ్చిపోతున్నార‌ని చంద్ర‌బాబు తెలిపారు.

ఇక‌, ప‌ల్నాడు, తాడిప‌త్రిలో ప‌రిస్థితి ఇప్ప‌టికీ అదుపులోకి రాక‌పోవ‌డాన్ని చంద్ర‌బాబు తీవ్రంగా త‌ప్పుబట్టారు. వైసీపీ రౌడీ మూకలు ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్న విష‌యం పోలీసులే గుర్తించినా.. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మాచర్లలో మారణహోమానికి కారణ‌మైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేయ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అలాగే విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు… పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేత స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసులు చోద్యం చూస్తున్నార‌ని చెప్ప‌డానికి నిదర్శనమ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. రాజ‌కీయ హింస‌ను ప్రేరేపించిన వారిపైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. ఇంత జ‌రుగుతున్నా.. మౌనంగా ఉన్న పోలీసుల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకుని ఆయా ఘ‌ట‌న‌ల‌ను వెంట‌నే నిలువ‌రించాల‌ని చంద్ర‌బాబు సూచించారు.