ఉండిలో త్రిముఖ పోరు.. ర‌ఘురామ ఫేట్ ఎలా ఉంది?

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరులో అంద‌రినీ ఆక‌ర్షించిన ఐదు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం, నారా లోకేష్ బ‌రిలో ఉన్న‌ మంగ‌ళ‌గిరి, చంద్ర‌బాబు పోటీ చేసిన కుప్పం, కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల పోటీ చేసిన క‌డ‌ప పార్ల‌మెంటు స్థానంతోపాటు.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. టీడీపీ నాయ‌కుడు క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పోటీ చేసి ఉండి అసెంబ్లీ స్థానం. ఈ ఐదు స్థానాల‌పైనా.. ఎక్కువ మంది పందేలు కూడా క‌ట్టార‌ని స‌మాచారం.

స‌రే.. వీటిలో మ‌రీ ప్ర‌త్యేక‌మైంది.. ఉండి. ఇక్క‌డ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా నామినేష‌న్ల ఘ‌ట్టం ప్రారంభానికి ఒక్క రోజు ముందు ఖ‌రారైన‌.. ర‌ఘురామ ఆ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. మొత్తానికి పోటీలో దిగి ప్ర‌చారం చేసుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల‌కు కూడా గుర‌య్యారు. స‌రే.. ఇక్క‌డ మాత్రం త్రిముఖ పోరు క‌నిపించింది. టీడీపీ రెబ‌ల్ అభ్య‌ర్థిగా మారిన క‌లువపూడి శివ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు. ఈయ‌న‌ను చంద్ర‌బాబు బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు.

ఇక‌, వైసీపీ త‌ర‌ఫున సాధార‌ణంగానే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా.. ఇక్క‌డ క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికే అవ‌కాశం ఇచ్చింది. మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్‌ను ప‌క్క‌న పెట్టినా.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ, వ‌ర్సెస్ ఇండిపెండెంట్ క‌లువ‌పూడి శివ‌ల మ‌ధ్య పోరు తీవ్రంగానే సాగింది. పైగా.. ఉండి నుంచి ర‌ఘురామ తొలిసారి పోటీ చేయ‌డంతోపాటు.. ఆయ‌న‌కు రాజుల నుంచి మ‌ద్ద‌తు ఉన్నా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల మ‌ద్దతును కూడ‌గ‌ట్ట‌లేక పోయారు. పైగా స్థానికేత‌రుడు అనే ముద్ర వేసుకున్నారు.

ఈ ఫ్యాక్ట‌ర్ కొంత వ‌ర‌కు ర‌ఘురామ‌కు వ్య‌తిరేకంగా మారే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. పోలింగ్ శాతం 76 వ‌ర‌కు జ‌రిగింది. ఇక‌, టీడీపీలో ఉన్నా.. టికెట్ ద‌క్క‌లేద‌న్న‌.. క‌లువ‌పూడి శివ సెంటిమెంటును కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. దీంతో ఆయ‌న ఇక్క‌డ ఓట్ల‌ను చీల్చ‌డంలో కీల‌కంగా మారారు. మంతెన రామ‌రాజు కూడా.. త‌న‌కు టికెట్ ప్ర‌క‌టించి.. చివ‌రి నిముషంలో తీసేసుకున్నార‌న్న ఆవేద‌న‌లో ఉండి. ప్ర‌చారానికి దూరంగా ఉన్నారు. ఈయన ప్ర‌భావం కూడా ఉంది.

పైగా క‌లువ పూడి శివ‌కు ఈయ‌న స్నేహితుడు. దీంతో త్రిముఖ పోరులో ఇండిపెండెంట్ ఎక్కువ‌గా ప్ర‌భావితం చూపించారు. మ‌రి ర‌ఘురామ ఏమేర‌కు స‌క్సెస్ అవుతారు? ఆయ‌న‌పై ఏమేర‌కు ఇక్క‌డి రాజుల‌కు సింప‌తి ఉంది? అనేది చూడాలి. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు.. ర‌ఘురామ స్వ‌ల్ప మెజారిటీతో అయినా.. గెలుపు గుర్రం ఎక్కొచ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.