అప్పుడు కూడా ఇంతే.. ఈ ఓట‌ర్లు మ‌హా ముదుర్లు బ్రో!

“సేమ్ టు సేమ్‌..! అప్పుడు కూడా ఇంతే.. ఈ ఓట‌ర్లు మ‌హా ముదుర్లు బ్రో”- ఇదీ.. ఇప్పుడు ఏపీ పోలింగ్ స‌ర‌ళిపై ఏ ఇద్ద‌రు మాట్లాడుకుంటున్నా వినిపిస్తున్న మాట‌. 2019లోనూ ఇదే త‌ర‌హా పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగింది. అర్ధ‌రాత్రి 12 నుంచి 1 గంట వ‌ర‌కు కూడా పోలింగ్ జ‌రిగింది. క్యూలైన్ల‌లో మ‌హిళ‌లు వేచి ఉన్నారు. పైగా 2014తో పోల్చుకుంటే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. 2014లో 77 శాతం పోలైతే.. 2019 నాటికి ఇది 79.04 శాతానికి ఎగ‌బాకింది. అంటే.. సుమారు 2 శాతం ఎక్కువ‌గానే పోలైంది.

ఇక‌, ఇప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితే క‌ళ్ల‌కు క‌ట్టింది. అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత కూడా.. 3500 పోలింగ్ బూతుల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగింది. నెల్లూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని పోలింగ్ బూతుల్లో మ‌హిళ‌లు.. క్యూలైన్ల‌లో క‌నిపించారు. మొత్తంగా మంగ‌ళ‌వారం ఉద‌యానికి ర‌మార‌మి 81 శాతానికి పైగానే ఓట్లు పోల‌య్యాయ‌ని అంచనా(పూర్తి ఫ‌లితం బుధ‌వారం నాటికి వ‌స్తుంది). అంటే.. గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు మ‌ధ్య 2 శాతం ఎక్కువ‌గా పోలింగ్ న‌మోదైంది.

దీంతో ఇప్పుడు ఏం జ‌రుగుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌బుత్వాన్ని మార్చే ఉద్దేశంతో ఓట‌ర్లు పోటెత్తార‌ని వైసీపీ నేత‌లు అనుకున్నారు.కానీ, తాము ఇచ్చిన ప‌సుపు-కుంకుమ కింద రూ.10 వేల‌ ప్ర‌భావంతోనే ఓటింగ్ శాతం పెరిగింద‌ని టీడీపీ చెప్పింది.చంద్ర‌బాబు అయితే.. పోలింగ్ జ‌రిగిన అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు సీఎం హోదాలో ప్రెస్ మీట్ పెట్టి 1 గంట వ‌రకు జిల్లాల వారీగా స‌ర‌ళిని వివ‌రించారు. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంది? ఇదీ.. ఇప్పుడు న‌రాలు తెగే టెన్ష‌న్ పుట్టేలా చేసింది.

దీనిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే. గ‌త ఎన్నిక‌ల పోలింగ్‌తో పోల్చుకుని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. కూట‌మి ఎన్నిక‌ల ప్ర‌చారం.. జ‌న‌సేన దూకుడు, బీజేపీ క‌ల‌యిక వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఇదేస‌మ‌యంలో వైసీపీ అనుకూల వ‌ర్గంలో విశ్వ‌స‌నీయ‌త‌, జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం వంటివాటిని తెర‌మీదికి తెస్తున్నారు. కానీ, ఓటేసిన ప్ర‌జ‌లు మాత్రం సైలెంట్‌గా ఎవ‌రి ప‌ని వారు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈవీఎంలు మాట్లాడితే త‌ప్ప‌.. నిజాలు బ‌య‌ట‌కురావు. అప్ప‌టి వ‌ర‌కు ఈ టెన్ష‌న్ అనేక మ‌లుపులు తిరుగుతూనే ఉంటుంది.