జగన్ కు జెండా ఊపిన సీబీఐ కోర్టు !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతించింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది.

విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల కిందటే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ నిబంధనలు సడలించాలని కోర్టును కోరారు.

అయితే, అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని, ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. జగన్ పిటిషన్ పై నేడు విచారణ కొనసాగించిన సీబీఐ కోర్టు… జగన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.