రాష్ట్రంలో కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ఆయా నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ బూతుల్లోనూ పెద్ద ఎత్తున ఓట్లర్లు బారులు తీరారు. కొన్ని కొన్ని బూతుల్లో అయితే.. రెండేసి వరుసల్లో ఓటర్లు బారులు తీరారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఆసక్తిగా మారింది.
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచివంగా గీత పోటీలో ఉన్నారు. ఇద్దరూ కూడా భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారు. చిత్రంగా ఇక్కడ ఉదయం 6 గంటలకే రెండే లైన్ల చొప్పున ఓటర్లు బారులు తీరారు.
కుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి యువ నేత భరత్ పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోని బూతుల్లో ఉదయం 5 గంటలకే ఓటర్లు వచ్చి బూతుల ముందు కూర్చున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఏకంగా ఆరు గంటలకే ఓటర్లు పోటెత్తారు.
మంగళగిరి: ఇక్కడ నుంచి టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ రెండో సారి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి తొలిసారి మురుగుడు లావణ్య బరిలోకి దిగారు. ఇక్కడ అయితే.. గతానికి భిన్నంగా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారు.
హిందూపురం: నందమూరి బాలయ్య వరుసగా మూడోసారి ఇక్కడ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి మహిళా నాయకురాలు బరిలో ఉన్నారు. ఇక్క డకూడా ఓటర్లు ఉదయాన్నే క్యూ కట్టారు.
అనకాపల్లి: ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా కనీ వినీ ఎరుగని రీతిలో ఉదయాన్నే ఓటర్లు తరలివచ్చారు.
పులివెందుల: సీఎం జగన్ వైసీపీ నుంచి, బీటెక్ రవి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక్క డకూడా ఉదయాన్నే ఓటర్లు పోటెత్తారు. ఇక్కడ గతంలో ఈ రేంజ్లో ఓటర్లు ఉదయాన్నే రాలేదు. దీంతో కీలక నియోజకవర్గాల్లో పోలింగ్ బూతులు కిక్కిరిసిపోతున్నట్టయింది. మరి ఇది దేనికి సంకేతం అనే విషయంపై టీడీపీ, వైసీపీలు తమ తమ రీతిలో విశ్లేషణలు చేస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates