ఉద్యోగులు పోటెత్తారు.. క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. !

ఏపీలో ఉద్యోగులు గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఓటెత్తారు. మొత్తం ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్న ఉద్యోగులు.. ఏకంగా 4.32 ల‌క్ష‌ల మందికి పైగా తమ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఒక‌ర‌కంగా.. 98 శాతం మంది ఉద్యోగులు ఓటేశారు. మొత్తంగా పోస్ట‌ల్ బ్యాలెట్ ప్రక్రియ అయితే.. ఏపీలో ముగిసింది. మిగిలిన ఒక‌టి అరా ఉంటే.. త‌ర్వాత‌.. వేసుకునే అవ‌కాశం ఉంది. అయితే.. ఇంత మంది పోటెత్త‌డం అంటే.. ఇదంతా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త అనేది విప‌క్షం మాట‌.

ఇది నిజ‌మే కావొచ్చు. ఒక్కొక్క‌సారి ప్ర‌భుత్వంపై వ్య‌తిర‌క‌త ఉన్న‌ప్పుడు.. ఇలానే పోటెత్తుతారు. అయితే.. అలాగ‌ని ఇది పూర్తిగా నిజ‌మ‌ని కూడా చెప్ప‌లేం. ఎందుకంటే.. జ‌గ‌న్ హ‌యాంలోనూ.. వివిధ రూపాల్లో ప్ర‌భుత్వ ఉద్యోగం పొందిన వారు ఉన్నారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ఎడ్మిన్‌లుగా.. కార్య‌ద‌ర్శులుగా ఏకంగా 1.32 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వైద్య‌, విద్య రంగాల్లోనూ 22 వేల మంది ఉద్యోగాలు పొందారు. ఇతర శాఖ‌ల్లోనూ మొత్తంగా 40 వేల మంది ఉద్యోగాలు పొందారు.

వీరంతా కూడా.. వైసీపీకి వ్య‌తిరేకంగా ఓటేస్తారా? ఆ అవ‌స‌రంఉందా? అనేది ప్ర‌శ్న‌. ఉంద‌ని కొంద‌రు చెబుతున్నారు. స‌మ‌యానికి జీతాలు ఇవ్వ‌క‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఇది అయ్యే అవ‌కాశం ఉంది. ఇక‌, ఉపాధ్యాయులు పూర్తిగా వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులు త‌మ పింఛ‌ను ర‌ద్దు చేయ‌లేద‌న్న ఆగ్ర‌హంతో ఉన్నారు. దీంతో ఈ రెండు వ‌ర్గాల వారు కూడా.. పెద్ద ఎత్తున ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

అయితే.. ఎవ‌రికి అనుకూలంగా వేశార‌నేది ఇప్పటి వ‌ర‌కు ఇత‌మిత్థంగా తెలియ‌డం లేదు. అయితే.. సీపీఎస్ ర‌ద్దు విష‌యంలో కొంత మేర‌కు సానుకూలంగా స్పందించిన జ‌న‌సేన వైపు ఎక్కువ‌గా ఉన్నార‌ని ఒక టాక్‌. అదేవిధంగా చంద్ర‌బాబు వ‌స్తే.. త‌మ‌కు రాజ‌ధాని ఏర్ప‌డుతుంద‌ని.. తమ వారికి ఉపాధి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్న ఉద్యోగులు ఈ వైపు నిల‌బ‌డ్డార‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఏదేమైనా.. భారీ సంఖ్య‌లో పోస్ట‌ల్ బ్యాలెట్ న‌మోదు కావ‌డం మాత్రం ఆస‌క్తిగా మారింది. జూన్ 4న వీటిని లెక్కించ‌నున్నారు.