లగడపాటి రాజగోపాల్ ఎక్కడ ? సర్వే ఎప్పుడు ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లగడపాటి రాజగోపాల్ ది ప్రత్యేక స్థానం. 2004, 2009 లోక్ సభ ఎన్నికలలో విజయవాడ నుండి పోటీ చేసి విజయం సాధించిన లగడపాటి 2014 ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిరసిస్తూ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నాడు. ప్రతి సారి ఎన్నికలప్పుడు, ఎన్నికలకు ముందు లగడపాటి తిరిగి రాజకీయాల్లో వస్తారని ప్రచారం నడుస్తుండేది. కానీ ఈ సారి ఆంధ్రా రాజకీయాలలో కనీసం లగడపాటి ప్రస్తావన రాకపోవడం చర్చానీయాంశంగా మారింది.

రాజకీయాలకు దూరంగా ఉన్నా 2018 తెలంగాణ ఎన్నికలలో, 2019 ఏపీ లోక్ సభ, శాసనసభ ఎన్నికలపై లగడపాటి సర్వే ఫలితాలు విడుదుల చేశాడు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ, కమ్యూనిస్టు కూటమికి 65 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 35, ఇతరులకు 14 స్థానాలు వస్తాయని లగడపాటి ప్రకటించాడు. అతని అంచనాలను తలకిందులు చేస్తూ 88 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అంతకుముందు 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని లగడపాటి చెప్పిన జోస్యం నిజమయింది. అదే విధంగా ఆంధ్రాలో టీడీపీ – బీజేపీ కూటమి 115 స్థానాలతో అధికారంలోకి వస్తుందని చెప్పాడు. దానికి కొంచె తక్కువగా 103 టీడీపీ, 4 స్థానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చాయి.

2019 ఏపీ ఎన్నికలలో టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని లగడపాటి జోస్యం చెప్పాడు. టీడీపీ 90 నుండి 100 స్థానాలు గెలుచుకుంటుందని, వైసీపీ 72 స్థానాల వరకు విజయం సాధిస్తుందని అంచనా వేశాడు. దానికి భిన్నంగా వైసీపీ 151 స్థానాలు గెలవగా, టీడీపీ 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.

తన సంచలన సర్వేలతో ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ ఈ ఏడాది జనవరిలో కాకినాడ శుభకార్యానికి వెళ్తూ మీడియాతో చివరిసారిగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం మూలంగా తాను రాజీనామా చేశానని, భవిష్యత్ లో తాను రాజకీయాలలోకి రానని లగడపాటి ఉద్ఘాటించాడు. అదే సమయంలో మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ లు ఇద్దరూ తనకు సన్నిహితులు అని, వారు ఎక్కడ పోటీ చేసినా రాజకీయాలకు అతీతంగా తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు. ఆ తర్వాత అతను మళ్లీ వార్తలలోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో ఎన్నికలు కేవలం మూడు రోజుల దూరంలో ఉన్న నేపథ్యంలో లగడపాటి ఎక్కడ అన్న చర్చ రాజకీయ వర్గాలలో వస్తున్నది.