గంటాకు సినీ గ్లామ‌ర్‌.. ప్ర‌చారాన్ని హోరెత్తించిన న‌మిత‌

ఎన్నిక‌ల వేళ నాయ‌కుల‌కు సినీ గ్లామ‌ర్ కూడా క‌లిసి వ‌స్తోంది. అయితే.. గ‌తంలో మాదిరిగా పెద్ద‌గా సినీ తారలు ఇప్పుడు ప్ర‌చారంలో క‌నిపించ‌డం లేదు. ఒక్క ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మాత్రం పిఠాపురంలో కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. నారా లోకేష్‌కు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు.. ఈ కుటుంబంలోని ఒక‌రిద్ద‌రు న‌టులు ప్ర‌చారం చేస్తున్నారు. ఇంత‌కు మించి పెద్ద‌గా సినీ గ్లామ‌ర్ ఇప్పుడు రాజ‌కీయ ప్ర‌చారంలో క‌నిపించ‌డం లేదు. కానీ, టీడీపీ నాయ‌కుడు, విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుకు సినీ గ్లామ‌ర్ క‌లిసి వ‌స్తోంది.

ఒక‌ప్ప‌టి అందాల న‌టి, హీరోయిన్ న‌మిత గంటాకు అనుకూలంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఆయ‌న వెంట ప్ర‌చారంలో పాల్గొంటూ.. కూట‌మిని గెలిపించాల‌ని.. టీడీపీని గెలిపించాల‌ని ఆమె ప్ర‌చారం చేస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేయాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారాని మ‌రో రెండు రోజులు మాత్ర‌మే అవ‌కాశం ఉంది. శుక్ర‌వారం, శ‌నివారం.. రెండు రోజులు మాత్ర‌మే ప్ర‌త్య‌క్ష ప్ర‌చారం చేసుకునేందుకు నాయ‌కుల‌కు అవ‌కాశం ఉంది. శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌చారాన్ని ముగించాలి. ఆదివారం ఎన్నిక‌ల సంఘం కూలింగ్ పిరియ‌డ్‌గా పేర్కొంటుంది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల నుంచి పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది.

ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ నేత‌లు.. మిగిలిన రెండు, మూడు రోజుల‌ను పూర్తిగా వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో గంటా శ్రీనివాస‌రావు.. న‌మిత‌ను ఆహ్వానించారు. తాజాగా ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని గంటా శ్రీనివాస‌రావు త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. వాస్త‌వానికి న‌మిత బీజేపీ నాయ‌కురాలు. అయితే.. కూట‌మి ఇక్క‌డ పోటీలో ఉన్న నేప‌థ్యంలో ఒక‌రిద్ద‌రి త‌ర‌ఫున ఆమె ప్ర‌చారం చేస్తున్నారు. ఇటీవ‌ల ధ‌ర్మ‌వ‌రంలో బీజేపీ నాయ‌కుడు స‌త్య కుమార్ త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. తాజాగా భీమిలిలో గంటా శ్రీనివాస‌రావు కోసం ప్ర‌చారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం అండీ” అంటూ ప్రసంగం ప్రారంభించి… “బాగున్నారా, భోంచేశారా?” అని సంబోధించారు. రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాల‌ని న‌మిత పిలుపునిచ్చారు. ‘జై బాలయ్య, జై చంద్రబాబు, జై పవన్ కల్యాణ్, జై గంటా శ్రీనివాసరావు’ అని నిన‌దించారు. కాగా, న‌మితను చూసేందుకు ప్ర‌జ‌లు బారులు తీరారు.