ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట హాట్ టాపిక్‌గా మారింది. ఈ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని.. ఈ చట్టంలోని లొసుగలను ఉపయోగించుకుని వైకాపా నాయకులు భూములు దోచేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశం వేగంగా జనాల్లోకి వెళ్లిపోతోంది. జగన్ సర్కారు ఓటమికి కారణమయ్యే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.

ఐతే ఈ చట్టం విషయంలో ప్రతిపక్షాల మీద జగన్ అండ్ కో ఎదురు దాడి చేస్తోంది. అసలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే ఈ చట్టాన్ని ప్రతిపాదించిందని.. మరి బీజేపీతో జట్టు కట్టి ఎన్నికలకు వస్తున్న టీడీపీ, జనసేన తమ మీద ఆరోఫణలు ఎలా చేస్తాయని వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఐతే కేంద్రం ప్రతిపాదించిన చట్టం వేరని.. దాన్ని ఇష్టానుసారం, తమకు అనుకూలంగా మార్చుకుని ప్రమాదకరంగా ఈ చట్టాన్ని రూపొందించారని ప్రతిపక్షాలు తిప్పి కొడుతున్నాయి. నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారం అయితే.. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ (టీఆర్‌వో)గా ఒక అధికారిని నియమించాలని.. కానీ వైసీపీ చట్టం ప్రకారం ఏ వ్యక్తినైనా టీఆర్‌వోగా నియమించవచ్చని.. ఇందులోనే పెద్ద కుట్ర ఉందని అంటున్నారు.

తమకు నచ్చిన వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టడం ద్వారా భూ వివాదాల్లో తమకు అనుకూలంగా వ్యవహరించేలా వైసీపీ నాయకులు చూసుకుంటారని ఆరోపిస్తున్నారు. ఇక రికార్డుల్లో భూ యజమానికి పేరును చేర్చి నోటిఫై చేశాక అభ్యంతరాలు చెప్పడానికి మూడేళ్ల గడువు ఉండాలని నీతి ఆయోర్ పేర్కొంటే.. ఆ గడువును వైసీపీ రెండేళ్లకు తగ్గించింది.

మరోవైపు టైట్లింగ్ వివాదం ఉన్నట్లు టీఆర్‌వో గుర్తిస్తే సెక్షన్ 10 కింద వివాదాల రిజిస్టర్లో వివరాలు నమోదు చేసి ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ (ఎల్డీఆర్వో) వద్దకు పంపాలని నీతి ఆయోగ్ పేర్కొనగా.. జగన్ ప్రభుత్వం తెచ్చిన చట్టంలో ఎల్డీఆర్వో ప్రస్తావనే లేదు. వివాదం ఉంటే ల్యాండ్ టైట్లింగ్ అప్పీలేట్ ఆఫీసర్‌ని ఆశ్రయించాలని పేర్కొన్నారు. ఇలా కేంద్ర ప్రతిపాదించిన చట్టానికి.. జగన్ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి చాలా తేడాలున్నాయని..అందుకే ఇది ప్రమాదకరమని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ జనాల్లోకి ఈ విషయాలను బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నాయి.,