నోటి ‘దురుసు’ తీరుస్తుందా ?!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే ఏహ్యా భావం కలిగే పరిస్థితి. అలాగని కొందరు ప్రతిపక్ష నేతలూ తక్కువేం కాదు. అధినేతల మాదిరిగానే వారి అనుచరులు యధా రాజ .. తధా ప్రజ అన్నట్లు ఉన్నారు. అయితే ఈ నేతల బూతులే ఈ సారి ఎన్నికలలో వారి కొంప ముంచనున్నట్లు తెలుస్తున్నది.

అధికార పార్టీలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు గత ఐదేళ్లలో వాడిన భాష తీరు ఈ సారి ఎన్నికలలో వారికి ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. పదవులలో ఉన్నప్పుడే కాకుండా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ వీరు అవే బూతులను నమ్ముకోవడం మొదటికే మోసం చేస్తుందని వారి అనుచరులు వాపోతున్నారు.

ముఖ్యంగా గుడివాడ నుండి పోటీ చేస్తున్న కొడాలి నాని, చిత్తూరు జిల్లా నగరి నుండి పోటీ చేస్తున్న మంత్రి రోజా, నరసారావుపేట ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సత్తెనపల్లి నుండి పోటీ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు, పెడన నుండి గెలిచిన మంత్రి జోగి రమేష్, అనకాలపల్లి నుండి గెలిచిన మంత్రి అమర్నాథ్, గన్నవరం నుండి టీడీపీ తరపున గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

వారం రోజులలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి నుండి వస్తున్న పలు నివేదికలలో వీరికి గడ్డుకాలం అనే మాట వినిపిస్తున్నది. అధిష్టానం మెప్పు కోసమో, మీడియాలో సంచలనం కోసమో నాయకులు మాట్లాడే మాటలు అప్పటి వరకు వారికి మంచిగా అనిపించవచ్చు. కానీ ప్రజలు వాటిని ఆమోదించరని ఈ సర్వేలను బట్టి తెలుస్తున్నది. జూన్ 4న ఫలితాలు వస్తేనే గానీ వీరి భవిష్యత్ ఏంటన్నది చెప్పలేం.