అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది. నరేంద్రమోడీ ఆకర్షణ, రామమందిరం, హిందుత్వవాదం తమను గెలుపు వాకిట నిలబడతాయని భావిస్తున్నారు. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు తెలంగాణలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సినీ నటులను ప్రచారానికి దించుతున్నారు.

అయితే ఈ సారి హోంమంత్రి అమిత్ షా పర్యటన తెలంగాణ బీజేపీ నేతలలో చర్చకు తెరలేపింది. గత కొన్నేళ్లుగా తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం పార్టీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. వచ్చిన ప్రతిసారి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలను పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై క్లాస్ పీకడంతో పాటు నేతల తప్పిదాలను సాక్ష్యాలతో సహా ముందుపెట్టి నిలదీసి వెళ్తున్నాడు. అందుకే తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షా సమావేశం అంటే హడలిపోయే పరిస్థితికి వచ్చారు.

తాజాగా ఎన్నికల నేపథ్యంలో పర్యటనకు విచ్చేసిన అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతల సమావేశంలో 17 పార్లమెంటు స్థానాలలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకుని కొన్ని సూచనలు మాత్రం చేశారట. అంతకుమించి ఏ ఒక్క నేతను కూడా ఒక్కమాట అనలేదట. అమిత్ షా అంత సైలెంట్ గా సమావేశం ముగించడం చూసి నేతలు ఆశ్చర్యానికి లోనయ్యారట.

తెలంగాణలో 17కు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని అమిత్ షా చెప్పడంతో అన్ని స్థానాలు గెలుస్తున్నామా ? అని బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారట. అధిక స్థానాలు గెలుస్తున్నందుకు సంతోషంతో ఏమీ అనకుండా ఉన్నారా ? లేక ఎన్ని సార్లు చెప్పినా ఏం ప్రయోజనం ? ఈ నేతలు మారేది లేదు. చచ్చేది లేదు అని వదిలేశాడా ? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అమిత్ షా సైలెంట్ తెలంగాణ బీజేపీ నేతలకు అంతులేని ఆశ్చర్యానికి గురిచేసిందని బీజేపీ కార్యాలయవర్గాల సమాచారం.