`పెద్దిరెడ్డి` నియోజ‌క‌వ‌ర్గం ఇంత డేంజ‌రా?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు అంటే..అసెంబ్లీ+పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఈ నెల 13న జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని ప్ర‌శాంత‌మైన‌వి ఉంటే.. మ‌రికొన్ని స‌మ‌స్యాత్మ‌క నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయ‌ని  రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి తెలిపారు. అయితే.. వీటన్నంటినీ మించి అత్యంత డేంజ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాలు 14 ఉన్నాయ‌ని తెలిపారు. వీటిలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పుంగ‌నూరు అత్యంత డేంజ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉంద‌ని పేర్కొన్నారు. వీటితోపాటు.. 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్యంత డేంజ‌ర్ ప‌రిస్థితులు ఉన్నాయ‌ని సీఈవో మీనా వెల్ల‌డించారు.

డేంజ‌ర్‌, అత్యంత డేంజ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌క్కా నిఘా పెడుతున్నామ‌న్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త చ‌రిత్ర‌ను ఈ సంద‌ర్భంగా మీనా వివ‌రించారు. ఇక్క‌డ ఈవీఎంల‌ను ఎత్తుకు పోవ‌డం.. నీళ్లు పోయ‌డం.. దొంగ  ఓట్లు వేయ‌డం.. బెదిరించ‌డం.. ఏజెంట్ల‌పై దాడులు చేయ‌డం.. పోలింగ్ బూతుల్లో హ‌ల్చ‌ల్ చేయ‌డం వంటివి కామ‌న్‌గా ఉన్న‌ట్టు తెలిపారు. అయితే..ఈ ద‌ఫా ఈ అత్యంత డేంజ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అన్ని బూతుల్లోనూ వెబ్ కాస్టింగ్‌(అన్ని అంశాల‌ను రికార్డు చేయ‌డం) చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రి క‌ద‌లిక‌పైనా నిఘా ఉంటుంద‌న్నారు. ఇక‌, రాష్ట్రంలో 4 కోట్ల 14 ల‌క్ష‌ల పైచిలుకు ఓటర్లు ఉన్నార‌ని.. వారంతా ప్ర‌శాంతంగా ఓటు హ‌క్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు.

ఇవీ.. అత్యంత డేంజ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాలు..

+ ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని పల్నాడు ప‌రిధిలో ఉన్న‌ మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు.

+ ఉమ్మ‌డి ప్రకాశం జిల్లాలో ఉన్న‌ ఒంగోలు.

+ ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ

+ ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని తిరుపతి(టీటీడీ చైర్మ‌న్ భూమన క‌రుణాక‌ర్ రెడ్డి కుమారుడు అభిన‌య్ రెడ్డి పోటీ చేస్తున్నారు), చంద్రగిరి(చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి త‌న‌యుడు మోహిత్ పోటీలో ఉన్నారు), పుంగ‌నూరు(పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి బ‌రిలో ఉన్నారు), ప‌ల‌మ‌నేరు, పీలేరు, తంబ‌ళ్ల‌ప‌ల్లె(పెద్దిరెడ్డి త‌మ్ముడు ద్వార‌కానాథ్‌రెడ్డి బ‌రిలో ఉన్నారు)

+ ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని రాయ‌చోటి.

+ ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని విజయవాడ సెంట్రల్.