నా రెండో సంత‌కం ఆ ఫైలు పైనే: చంద్ర‌బాబు

కూట‌మి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంత‌కం.. మెగా డీఎస్సీపైనేన‌ని.. దీనివ‌ల్ల 20 వేల మంది నిరుద్యోగుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆయ‌న ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాలలో నిర్వ‌హించి ప్ర‌జాగ‌ళం ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో మాట్లాడుతూ.. త‌న రెండో సంత‌కం గురించి కూడా వివ‌రించారు. “తొలి సంత‌కం మెగా డీఎస్సీపైనే ఉంటుంది. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఇక‌, రెండో సంత‌కం గురించికూడా త‌మ్ముళ్లు అడుగుతున్నారు. ఇది రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మేలు చేసే విధంగా ఉంటుంది” అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్ర‌జ‌ల భూహ‌క్కును లాగేసుకుంటూ.. త‌న వారికి ప్ర‌జ‌ల ఆస్తుల‌ను పంచేయాల‌న్న కుటిల బుద్ధితో జ‌గ్గు భాయ్‌(జ‌గ‌న్) తీసుకువ‌చ్చిన `ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌` ర‌ద్దుపైనే త‌న రెండో సంత‌కం ఉంటుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. దీనిని పూర్తిగా ర‌ద్దు చేస్తామ‌ని.. రైతులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, మ‌హిళ‌లు ప్ర‌శాంతంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అయితే.. మీరంతా కూట‌మి పార్టీల అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

చంద్ర‌బాబు ప్ర‌సంగంలో కీల‌క అంశాలు..

+ జగన్ ఒక దళారి, ప్రజల పొట్ట కొట్టాలో తెలిసిన వ్యక్తి. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకున్నాడు. క్వార్టర్ రూ.65 ఉన్న మద్యం ధర నేడు రూ.200 పెరిగింది. నాశిరకం మద్యంతో 30వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెచ్చాడు. మేం వ‌చ్చాక మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గిస్తాం. నాణ్య‌మైన మ‌ద్యం ఇస్తాం.

+ జ‌గ్గూ భాయ్ ఇసుక‌ను కూడా వ‌ద‌ల‌కుండా దోచుకున్నాడు. ట్రాక్టర్ ఇసుక ధ‌ర‌ను రూ.5000 పెంచేశాడు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఉచితంగానే ఇసుక ఇస్తాం.

+ ఈ జ‌గ్‌ల‌క్‌(జ‌గ‌న్‌)కి పరిపాలన చేతకాదు. డ్రైవింగ్  ఎలా చేయాలో తెలియ‌క రివర్స్ గేర్ లో రాష్ట్రాన్ని వెన‌క్కి తీసుకువెళ్లాడు. నేను వ‌చ్చాక‌.. డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పుతా. రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ముందుకు తీసుకువెళ్తా.  సంపద సృష్టిస్తా. పంచుతా.

+ కూట‌మి ఎన్నికల మేనిఫోస్టో అధిరిపోయే హామీలు ఇచ్చాం. జ‌గ‌న్ రెండు టీవీలు ప‌గ‌ల కొట్టాడంట‌. రాజధాని పేరు చెప్పలేని దౌర్బాగ్యం తెచ్చాడు జ‌గ్గూభాయ్‌. రాష్ట్రానికి అన్నీ మేళ్లు చేస్తాం. మేనిఫెస్టోలో చెప్పిన‌వ‌న్న అమ‌లు చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.