మన ప్రముఖుల డేటా ఆలీబాబా ద్వారానే డ్రాగన్ కు చేరిందా ?

అవుననే అంటున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. దేశంలోని సుమారు 10 వేలమంది ప్రముఖుల వ్యక్తిగత, అధికారిక డేటా మొత్తాన్ని చైనా తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. భారత్ తో ప్రత్యకంగా పోరాటం చేయలేని డ్రాగన్ దేశం దొంగదెబ్బ తీయటానికి రెడీ అయిపోయిందట.

చైనా దేశానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ గ్రూపు, వాణిజ్యసంస్ధ ఆలీబాబా ద్వారా మనదేశంలోని అత్యంత ప్రముఖుల డేటాను తీసేసుకుందని ప్రభుత్వానికి నివేదిక అందింది. మనదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్నఅనేక పరిశ్రమలు, వాణిజ్యంసంస్ధలు అంతర్జాతీయ స్ధాయిలో కార్యకలాపాలను విస్తరించుకునేందుకు ఆలీబాబా సంస్ధను వేదికగా ఉపయోగించుకుంటున్నాయి.

మనదేశంలోని సంస్ధలు విదేశాల్లో వ్యాపార విస్తరణ చేసుకోవాలంటే మంచి ప్లాట్ ఫారం అవసరం. అందుకనే ఆలీబాబా అందిస్తున్న టెక్నాలజీ గ్రూపు సర్వర్లను ఉపయోగించుకుంటున్నాయి. ముందుగా ఈ సర్వర్లలో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. మొదటిసారి నమోదు చేసుకునేటపుడు అంతా ఉచితం అనే పద్దతినే ఆలీబాబా కూడా వినియోగదారులను ఆకర్షిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

తర్వాత్తర్వాత కొంత కాలానికి సేవలు నిరాఘాటంగా సాగేందుకు మరిన్ని వివరాలను అప్ డేట్ చేయమని నిర్భందిస్తాయి. దాంతో వాళ్ళడిగిన డేటా మొత్తాన్ని వినియోగదారులు అందిస్తారు. ఇలాంటి 72 సర్వర్ల ద్వారా దేశంలోని ప్రముఖుల డేటా మొత్తం చైనాకు చేరిందని నిఘా వర్గాలు ఓ నివేదికను కేంద్రానికి అందించాయి.

తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో దేశవ్యాప్తంగా సంచలనం మొదలైంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, శాస్త్రజ్ఞులు, సెలబ్రిటీలు తదితరుల డేటా మొత్తం ఇపుడు చైనా గుప్పిట్లో ఉందనే వార్త నిజంగా ఆందోళనకరమనే చెప్పాలి.

ఈ విషయంలో అనుమానం వచ్చిన తర్వాత కేంద్రం మనదేశంలోని చైనా యాప్ లన్నింటిపైనా నిషేధం విధించింది. అయినా ఇంకాకొన్ని యాప్ లు పనిచేస్తున్నట్లు టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు జూమ్ యాప్ చాలా విస్తృతంగా వాడుకలో ఉంది. ఈ యాప్ చైనాదని కొందరు కాదు అమెరికాదే అని మరికొందరు వాదిస్తున్నారు.