బాబు అలా.. లోకేష్ ఇలా.. ఎలాగబ్బా?

Lokesh Chandrababu

రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయిన టాపిక్ విషయంలో ఒక పార్టీలో ఉన్న ముఖ్య నేతలు అందరూ ఒకే స్టాండ్ మీద నిలబడడం.. ఒకే విధంగా స్వరం వినిపించడం అవసరం. అలా కాకుండా ముఖ్య నేతల్లో ఒకరు ఒకలా, ఇంకొకరు మరోలా స్పందిస్తే జనాల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాయి దాడి విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం స్పందిస్తున్న తీరు కొంచెం చిత్రంగానే ఉంది. జగన్ మీద రాయి దాడి నిజంగా జరిగిందా.. దీని వెనుక కోడి కత్తి తరహా డ్రామా ఉందా.. అనే విషయంలో రకరకాల సందేహాలు రేకెత్తుతున్న మాట వాస్తవం.

ఐతే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక స్టాండ్ తీసుకుని దాని ప్రకారమే వ్యవహరించాల్సింది. ఐతే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రాజకీయాల ప్రస్తావన లేకుండా హుందాగా ఒక ట్వీట్ పెట్టారు. జగన్‌పై దాడిని ఖండిస్తూ ఇలాంటి పరిణామాలు జరగకుండా చూడాలని ఈసీని కోరారు. జగన్‌పై దాడి వెనుక ఏం జరిగి ఉన్నా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు స్పందించాల్సిన తీరు ఇదే.

కానీ చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మాత్రం వేరే రూట్ తీసుకున్నారు. జగన్‌పై దాడి అంతా ఒక నాటకం అంటూ ఆయన ట్వీట్లు వేస్తున్నారు. ఐతే జగన్‌‌పై దాడిని అనుమానిస్తే అనుమానించవచ్చు. కానీ అది నారా లోకేష్ స్థాయి నాయకుడు చేయాల్సిన పని లేదు. ముందుగా ఆయన ఈ దాడిని ఖండిస్తూ ఒక ట్వీట్ వేయాలి.

ఈ దాడి వెనుక డ్రామా ఉందేమో అని అనుమానించే పని వేరే వాళ్లకు అప్పగించాల్సింది. ద్వితీయ స్థాయి నాయకత్వం ఈ పని చూసుకుని ఉండొచ్చు. నిజానికి టీడీపీలో చాలామంది ఈ పనిలోనే ఉన్నారు. కానీ ఓవైపు చంద్రబాబు హుందాగా ట్వీట్ వేసి జగన్‌పై దాడిని ఖండిస్తుంటే.. ఇంకోవైపు లోకేష్ ఇలాంటి ట్వీట్లు వేయడం ఆయన స్థాయికి తగని పనిలా కనిపిస్తోంది. ఒకే విషయం మీద తండ్రీ కొడుకులు డిఫరెంట్ స్టాండ్ తీసుకోవడం చూసేవారికి బాగా అనిపించడం లేదు.