సెంచరీ కొట్టగలిగితే చాలనుకుంటున్న వైసీపీ?

2019 ఎన్నికల్లో వైసీపీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ లభించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, ఏకంగా 151 నియోజకవర్గాల్ని వైసీపీ గెలిచింది. మళ్ళీ అలాంటి విక్టరీ సమీప భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పార్టీకి సాధ్యమా.? అంటే, ఏమో.. చెప్పలేం.!

కానీ, ఆంధ్ర ప్రదేశ్‌లోని అధికార వైసీపీ, వై నాట్ 175 అంటోంది.! అదే దిశగా ఎన్నికల కార్యాచరణని, దాదాపు ఏడాది క్రితమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగులతో మొదలైంది ఈ ప్రసహనం. గడప గడపకీ వైసీపీ సహా అనేక కార్యక్రమాలు ఈ కోవలో ప్రారంభమైనవే.

అయితే, ఇంటింటికీ వైసీపీ ప్రజా ప్రతినిథులు వెళుతోంటే, ఎదురైన చీత్కారాల నేపథ్యంలో వైసీపీలో కొంత నీరసం ఆవరించింది. ఈలోగా ఎన్నికలు ముంచుకొచ్చేశాయ్.! ఇప్పటికీ వైసీపీ నేతలు కొందరు ‘వై నాట్ 175’ అంటున్నా, లోలోపల వంద గెలిస్తే చాలనుకుంటున్నారు.

వంద కూడా కాదు, 90 సీట్లు గెలిచి, అధికార పీఠమెక్కితే, ఆ తర్వాత టీడీపీ శాశ్వతంగా సమాధి అయిపోతుందనే భావన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇంతకీ, ప్రస్తుతం పొలిటికల్ ఈక్వేషన్ ఎలా వుంది.? అంటే, వైసీపీకి ఏమంత ఆశాజనకంగా కనిపించడంలేదు.

వైసీపీ నుంచి ఎప్పుడైతే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర పార్టీల్లోకి దూకెయ్యడం ప్రారంభమైందో, అప్పుడే వైసీపీ పతనంపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది రాజకీయ పరిశీలకులకి. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి వల్ల వైసీపీకి రాజకీయంగా చావు దెబ్బ తగలబోతోందన్నది నిర్వివాదాంశం.

ఎవరు గెలిచినా, పార్టీ ఫిరాయింపులు అధికార పార్టీలోకి ఎన్నికల తర్వాత అనూహ్యంగా వుండబోతున్నాయి. తెలంగాణలో రాజకీయాల్ని చూస్తున్నాం కదా.! ఎన్నికల వరకు అసలు కాంగ్రెస్ పార్టీ గేమ్‌లోనే లేదు. గులాబీ పార్టీకి తిరుగులేదని అంతా అనుకున్నారు. లోక్ సభ ఎన్నికలొచ్చేసరికి గులాబీ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి.

అదే పరిస్థితి, ఆంధ్ర ప్రదేశ్‌లో వైసీపీకి రాబోతోందా.? అంటే, ఔననే అభిప్రాయాలు అన్ని వైపుల నుంచీ వినిపిస్తున్నాయి. అందుకే, ‘ఎలాగోలా వంద గెలిస్తే చాలు..’ అన్న స్థాయికి వైసీపీ శ్రేణుల ఆలోచనలు పడిపోతున్నాయి.