లోకల్ ఫ్లేవర్ … బాబులో భారీ ఛేంజ్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో మూస ధోర‌ణుల‌కు స్వ‌స్తి చెబుతున్నారు. వ్యూహా త్మకంగా అడుగులు వేస్తున్నారు. త‌ను చెప్పాల‌ని అనుకున్న దానిని స్థానిక స‌మ‌స్య‌ల‌తో ముడి పెట్టి ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సాధార‌ణంగా చంద్ర‌బాబు ఎక్క‌డ ప్ర‌సంగించినా.. త‌న విజ‌న్ గురించే చెప్ప‌డం అల‌వాటు. తాను సైబ‌రాబాద్ క‌ట్టించాన‌ని.. త‌ను అభివృద్ది అంబాసిడ‌ర్ న‌ని చెప్పుకోవ‌డం తెలిసిందే.

అయితే.. ఇది అనుకున్నంత వేగంగా సాధార‌ణ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం లేదు. పైగా స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తా వించ‌డం లేద‌నే ఫీడ్ బ్యాక్ కూడా వ‌స్తోంది. దీంతో చంద్ర‌బాబు గ‌త రెండు రోజుల నుంచి త‌న వ్యూహాన్ని మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎక్క‌డ‌కు వెళ్తే.. అక్క‌డ స‌మ‌స్య‌లు ప్ర‌స్తావిస్తున్నారు. బుధ‌వారం త‌ణుకు, పాల‌కొల్లులో ప్ర‌సంగించిన‌ప్పుడు కూడా.. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. తాజాగా పి.గ‌న్న‌వ‌రంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా.. ఇదే ప‌ద్ధ‌తిని ఆయ‌న అవ‌లంబించారు.

దీంతో చంద్ర‌బాబు సామాన్యులకు బాగా క‌నెక్ట్ అయ్యార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, ఇదేస‌మ‌యంలో త‌న పార్టీ గురించే ప్ర‌మోట్ చేసుకోవ‌డం కాకుండా.. జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వర్గాల్లో వారితో క‌లిసి ప్ర‌చారం చేయ‌డం ద్వారా క్షేత్ర‌స్థాయిలో మూడు పార్టీలూ ఒక్క‌టే అనే బ‌ల‌మైన సంకేతాలు పంపిస్తున్నారు. పి. గ‌న్న‌వ‌రంలో జ‌న‌సేన అభ్య‌ర్థి పోటీ చేస్తున్నాడు. ఈయ‌న‌కు అనుకూ లంగా చంద్ర‌బాబు ప్ర‌చారం చేశారు. ఇక‌, న‌ర‌సాపురం పార్ల‌మెంటు ప‌రిధిలో బీజేపీ అభ్య‌ర్థి శ్రీనివాస వ‌ర్మ‌ను ప‌క్క‌న నిల‌బెట్టుకుని గెలిపించాల‌ని కోరారు.

త‌ద్వారా క్షేత్ర‌స్థాయిలో మూడు పార్టీలు క‌ల‌వ‌లేద‌న్న చర్చ‌కు చంద్ర‌బాబు చెక్ పెడుతున్నారు. ఇక‌, ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ విష‌యాన్ని కూడా హైలెట్ చేస్తున్నారు. ప‌వ‌న్ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా .. ప్ర‌య‌త్నిస్తున్నారు. ప‌వ‌న్ ప్ర‌జ‌ల కోస‌మే వ‌చ్చాడ‌ని.. సంపాయించుకునే మార్గాల‌ను వ‌దులుకున్నార‌ని చెప్ప‌డం ద్వారా.. యువ‌త‌లో సానుభూతి మ‌రింత పెరిగేలా చేస్తున్నారు. ఇక‌, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రిపైనా కాంప్లిమెంట్ల జ‌ల్లు కురిపిస్తున్నారు. మొత్తంగా చంద్ర‌బాబు చాలా వ్యూహాత్మ‌కంగా రోజు రోజుకు త‌న ప్ర‌చారాన్ని ప‌దును పెంచుతున్నారు.