ఒక‌ప్ప‌టి లోకేష్ కాదు.. ఇప్పుడు రేంజ్ వేరు!

ప్ర‌త్య‌ర్థి పార్టీల కౌంట‌ర్ల‌కు స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేక‌.. త‌డ‌బ‌డుతూ క‌నిపించే నారా లోకేష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఇప్పుడు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట ఇది. నిరంతరం మెర‌గ‌వుతూ రాజ‌కీయ నాయ‌కుడిగా లోకేష్ ఇంప్రూవ్ అవుత‌న్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ త‌మిళ‌నాడు అధ్యక్షుడు అన్నామ‌లై కోసం ప్ర‌చారం చేసేందుకు లోకేష్ అక్క‌డికి వెళ్లారు. ఈ ప‌రిణామంలో లోకేష్ పేరు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇత‌ర రాష్ట్రంలో ప్ర‌చారం కోసం లోకేష్‌ను ఆహ్వానించారంటే ఇది రాజ‌కీయంగా ఆయ‌న‌కు ద‌క్కిన గుర్తింపేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

తండ్రి చంద్ర‌బాబు నాయుడు బాట‌లో రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన లోకేష్‌.. 2014లో టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేశారు. అప్పుడు ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయ్యారు. రాజ‌కీయాల్లోకి కొత్త‌గా రావ‌డం లోకేష్ మొద‌ట్లో త‌డ‌బ‌డ్డారు. వ్యాఖ్య‌లు, వ్య‌వ‌హార శైలి కూడా ప‌దునుగా ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో ప్ర‌త్య‌ర్థి పార్టీలు లోకేష్‌ను ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేసేవి. ఇక 2019లో తొలిసారి ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌ల్లో పాల్గొన్న ఆయ‌న మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో లోకేష్‌కు రాజ‌కీయాలు తెలియ‌వని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ ఆ ఓట‌మి త‌ర్వాత లోకేష్ మ‌రింత ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగారు. త‌న‌ను తాను మార్చుకుంటూ వ‌స్తున్నారు.

మ‌రింత మెరుగైన నాయ‌కుడిగా లోకేష్ ఎదుగుతున్నారు. చంద్ర‌బాబు నాయుడు అరెస్టు త‌ర్వాత లోకేష్ జాతీయ స్థాయిలో క‌వ‌రేజీ ల‌భించింది. సుప్రీం కోర్టులో పోరాటంతో పాటు జాతీయ స్థాయిలో బాబు అరెస్టును హాట్ టాపిక్‌గా మార్చేందుకు నేష‌న‌ల్ మీడియాతో మాట్లేడుందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ఆర్నాబ్‌తో లోకేష్ ఇంట‌ర్వ్యూ సెన్సేష‌న్‌గా మారింది. ఇక మీడియా స‌మావేశాల్లోనూ ఎలాంటి త‌డ‌బాటు లేకుండా మాట్లాడుతున్నారు. అడిగి మ‌రీ ప్ర‌శ్న‌లు వేయించుకుంటున్నారు. మ‌రోవైపు న‌మ్మిన వాళ్ల కోసం నిల‌బ‌డ‌ట‌మూ లోకేష్‌ను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. విజ‌య‌వాడ‌లో కేశినేని చిన్నికి మ‌ద్ద‌తుగా ఉన్న లోకేష్ ఏ ద‌శ‌లోనూ వెన‌క్కి త‌గ్గ‌లేదు. అక్క‌డ ఎంపీ కేశినేని నాని టీడీపీ నుంచి వెళ్లిపోయినా ప‌ట్టించుకోలేదు. ఇలాంటి అంశాల కార‌ణంగానే లోకేష్‌కు ఇప్పుడు స్పెష‌ల్ ఇమేజీ వ‌చ్చింద‌నే టాక్ ఉంది.