టీడీపీకి ఆ సీట్ల‌ను వైసీపీ గోల్డెన్ ప్లేట్‌లో పెట్టి ఇస్తోందిగా..!

ఔను.. రాష్ట్రంలో ఎక్క‌డ ఎలాంటి ప‌రిస్తితి ఉందో తెలియ‌దు కానీ.. ఉమ్మడి ప్ర‌కాశం జిల్లాలో మాత్రం వైసీపీ రెండు కీల‌క సీట్ల‌ను వైరిప‌క్షం టీడీపీకి గోల్డెన్ ప్లేట్లో పెట్టి ఇస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంకో మాట చెప్పాలంటే.. అసలు ఆ సీట్ల‌లో పోటీనే లేద‌ని.. కేవ‌లం ఎన్నిక‌లు మాత్ర‌మే జ‌రుగుతున్నాయ‌ని.. టీడీపీ నేత‌లు అనేస్తున్నారు. ఇదేదో పార్టీపై అభిమానంతోనో.. వైసీపీ అంటే వ్య‌తిరేక‌త‌తోనో చెబుతున్న మాట కాదట‌. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని అంచ‌నా వేశాక‌.. ఇక‌ ఇక్క‌డ ప్ర‌చారం చేయ‌క‌పోయినా.. గెలుపు మాదే అనేస్తున్నారు. ఇంత‌కీ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ఏంటంటే.. ఒక‌టి అద్దంకి.. రెండు ప‌రుచూరు.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీల క‌న్నా.. వ్య‌క్తుల‌కే బ‌లం ఎక్కువ‌గా ఉంద‌నేది స‌ర్వేలు కూడా చెబుతున్న మాట‌. పార్టీలు ఉన్నా.. వాటి ప్ర‌భావం క‌న్నా.. ఇక్క‌డ నుంచి బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల బ‌లాబలాలు చూసుకుంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేల ముందు.. వారిపై పోటీ చేస్తున్న వారు తేలిపోతున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అంతేకాదు.. వీరిలో ఒక‌రు నాన్ లోక‌ల్ కూడా కావ‌డంతో అస‌లు పెద్ద‌గా పోటీ కూడా ఉండ‌ద‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, ప‌రుచూరులో స్థిర‌మైన, సుస్థిర‌మైన నాయ‌కుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు తెచ్చుకున్నారు. దీంతో ఇక్క‌డ కూడా.. పెద్ద‌గా పోటీ ఉండ‌ద‌నే ప్ర‌చారం ఉంది.

అద్దంకి: ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి పోటీ చేస్తున్నారు. ఓవ‌రాల్‌గా నాలుగుసార్లు అద్దంకిలోనే వ‌రుస‌గా మూడు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న ర‌వి ఈసారీ విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్నార‌నేది టీడీపీ నేత‌ల మాట‌. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. తొలి రెండు సార్లు ఆయ‌న డిఫ‌రెంట్ పార్టీల నుంచి పోటీ చేశారు. అయినా.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. 2004, 2009లో కాంగ్రెస్‌, 2014లో వైసీపీ, 2019లో టీడీపీ నుంచి వ‌రుస‌గా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అంటే..ఇక్క‌డ పార్టీల‌కంటే కూడా గొట్టిపాటిని చూసే ప్ర‌జ‌లు ఓటెత్తార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇక‌, వైసీపీ ఇక్క‌డ పాణెం చిన హ‌నిమిరెడ్డి అనే నాన్ లోక‌ల్‌ను రంగంలొకి దింపింది. ఆయ‌న ఎక్క‌డో గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతం పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలోని దొడ్లేరు గ్రామానికి చెందిన వ్య‌క్తి. ఇది.. గొట్టిపాటికి మ‌రింత‌గా క‌లిసి వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అస‌లు చిన హ‌నిమి రెడ్డి వైసీపీ ఇన్‌చార్జ్‌గా వ‌చ్చాక వైసీపీని అభిమానించే బ‌ల‌మైన రెడ్డి క‌మ్యూనిటీతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తెలుగుదేశంలోకి పుంకాను పుంకాలుగా వ‌ల‌స‌ల బాట ప‌ట్టేస్తున్నారు. ఇక ర‌వి సిట్టింగ్ నేత‌, పైగా పిలిస్తే.. ప‌లికే నాయ‌కుడు ఉండ‌గా.. ఎక్క‌డ నుంచి వ‌చ్చారో తెలియ‌ని నాయ‌కుడిని ఎలా గెలిపిస్తామ‌నేది లోక‌ల్ టాక్‌. మొత్తంగా ఈ సీటు ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీ ఖాతాలో ప‌డింద‌ని చెబుతున్నారు.

ప‌రుచూరు: ఇది కూడా దాదాపు సేమ్ టు సేమ్. ఇక్క‌డ కూడా పార్టీ కంటే వ్య‌క్తికే బ‌లం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. 2014లో తొలి సారి టీడీపీ టికెట్ పై ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్న ఏలూరి సాంబ‌శివ‌రావు.. అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని.. పార్టీల‌కు అతీతంగా ముందుకు సాగారు. త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఇది ఆయ‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చింది. వైసీపీ హ‌వా ఉన్నా కూడా ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం అందుకున్నారు. ఇక‌, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అంటున్నారు స్థానికులు.

ఇక‌, వైసీపీ నుంచి ఎడ‌మ బాలాజీ పోటీ చేసినా.. కేవ‌లం ఆయ‌న పోటీ ఉన్నారంటే ఉన్నార‌నే వాద‌నే వినిపిస్తోంది. గెలుపు ఏక‌ప‌క్ష‌మ‌నే లెక్క‌లు వ‌స్తున్నాయి. బాలాజీ చీరాల నేత‌.. పైగా పలు పార్టీలు, నియోజ‌క‌వ‌ర్గాలు మారి వ‌ల‌స‌ప‌క్షిలా ఇప్పుడు ప‌రుచూరులో దిగారు. ఏలూరి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్‌లో ఇప్పుడు ఉన్నారు. ఫ‌లితంగా ప‌రుచూరు కూడా టీడీపీ ఖాతాలోనే ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది. మొత్తంగా ఈ రెండు సీట్లు కూడా వైసీపీ బంగారు పళ్లెంలో పెట్టి అందిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.