వ‌లంటీర్ల నిషేధంపై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు, పింఛ‌న్ల పంపిణీ స‌హా ఇత‌ర ఏ కార్య‌క్ర‌మాల‌కైనా వ‌లంటీర్ల‌ను వినియోగిం చ‌రాదంటూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్లు త‌మ ఫోన్ల‌ను, వేలిముద్ర‌లు తీసుకునే డివైజ్‌ల‌ను అధికారుల‌కు అప్ప‌గించేశారు. ఈ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రేపు (ఏప్రిల్ 1) నెలవారీ పింఛన్లు ఇస్తారా, లేదా? అనే అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రజలకు ఊరటనిచ్చింది. పెన్షన్ల పంపిణీకి తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, పెన్షన్లు అందించేందుకు వాలంటీర్లను వినియోగించవద్దని స్పష్టం చేసిందని చంద్ర‌బాబు అన్నారు.

ఈసీ నిర్ణయంపై రాష్ట్ర సీఎస్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో… ఏపీలో పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు కోరారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, డోర్ టు డోర్ విధానంలో పెన్షన్ లు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్ల పంపిణీ నిలిచిపోకూడదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు కేటాయించి పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు.

మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తాం!

బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మి అధికారంలోకి వచ్చాక మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రామాయపట్నం పోర్టుకు అన్ని అనుమతులు తెచ్చామని వెల్లడించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రామాయపట్నం పోర్టు పనులు ఆగిపోయాయని ఆరోపించారు. జిల్లాలో సుబాబుల్ ఎక్కువగా పండిస్తారని ఏషియన్ పల్ప్ పరిశ్రమను తెచ్చానని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏషియన్ పల్ప్ పరిశ్రమ పారిపోయిందని తెలిపారు. నవరత్నాలు అని చెప్పి నవ మోసాలు చేశారని మండిపడ్డారు.