ఎన్నిక‌ల‌కు ముందే మేం ఒక ఎంపీ సీటు గెలిచేశాం

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ప్ర‌స్తుతం షెడ్యూల్ మాత్ర‌మే వ‌చ్చింది. ఇంకా, నోటిఫికేష‌న్ వ‌చ్చేందుకు 20 రోజుల స‌మ‌యం ఉంది. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఎన్నిక‌లు జ‌రిగేందుకు మ‌రో 20 రోజుల‌కు పైగానే స‌మ‌యం ఉంది. మ‌రి ఇంత స‌మ‌యం ఉన్నా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “ఎన్నిక‌ల‌కు మేంద మేం ఒక పార్ల‌మెంటు సీటును గెలిచేశాం” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీలో ఉత్సాహం రెట్టింప‌యింది. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్న చంద్ర‌బాబు.. ప్ర‌జాగ‌ళం పేరుతో నెల్లూరులో ప‌ర్య‌టించారు.

ఈ క్ర‌మంలో నెల్లూరులో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం  స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. “ఎన్నికల ఫలితాలు  జూన్ 4న విడుదల వ‌స్తాయి. ఇంకా ఎన్నిక‌లే జ‌ర‌గ‌లేదు. కానీ, నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న‌ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడో గెలిచారు. ఇక తెలియాల్సింది.. మెజారిటీ మాత్ర‌మే” అని చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా నెల్లూరు వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న వి. విజ‌య‌సాయి రెడ్డిపై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు.

“నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుంటే.. ఆయ‌న‌పై ఎవరినీ పోటీకి దింపారో తెలుసా?  ఏ2, ఒక అవినీతిపరుడు, ఒక పనికిమాలిన వ్యక్తి, ఒక దళారీ వ్యవస్థకు నిజ స్వరూపం వంటి వ్యక్తి. నిన్న చూశాం… మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నాడు. అయ్యా వెళ్లిపోకండి… భోజనం పెడతాం తినండి…బాబ్బాబూ ఉండండి అని బతిమాలుకుంటున్నాడు… కానీ, నువ్వు వద్దు, నీ ఉపనాస్యం వద్దు అని జనాలు పారిపోయే పరిస్థితికి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డీ… నీ ఎంపీ విశ్వసనీయత అదీ!” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.  

కాగా, కావ‌లిలో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం స‌భ‌కు భారీ ఎత్తున జ‌నాలు వ‌చ్చారు. దీనిని ప్ర‌స్తావిస్తూ.. చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. “ఇవాళ కావలి సభకు వచ్చిన జనాలను చూశావా జ‌గ‌న్ రెడ్డీ..  ఇదీ.. మా ఎంపీ విశ్వసనీయత. నిన్ను ఓడించడానికి మండుటెండలను కూడా లెక్కచేయకుండా మేము సిద్ధం అంటూ ముందుకొచ్చారు. ప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అర్ధాంగి ప్రశాంతి రెడ్డి కోవూరులో పోటీ చేస్తున్నారు. ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన.. రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు దగ్గర అవ్వాలని వారు భావించారు. కానీ, ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఆ ఆడబిడ్డ ముందుకొచ్చి స్వయంగా ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది” అని వేమిరెడ్డి ప్ర‌శాంతిపై వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌ను చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు.

ఆయ‌న‌కే బుల్లెట్ దింపారు!

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాద‌వ్‌పై చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. “ఇష్టానుసారం బూతులు తిట్టడం, దుష్ప్రచారం చేస్తూ ఉన్మాదుల్లా తయారయ్యారు. మొన్నటివరకు మీరు ఒకాయనను చూశారు. బుల్లెట్ దించుతాం అంటుండేవాడు. ఇప్పుడు ఆయనకే బుల్లెట్ దిగింది. ఒక తన్ను తంతే వెళ్లి నరసరావుపేటలో పడ్డాడు” అని వ్యాఖ్యానించారు.