సెంటి మెంటు + కూట‌మి ఎఫెక్ట్ : ఆ సీటు టీడీపీదే!

కాలం క‌లిసి రావ‌డ‌మంటే ఇలానే ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినప్ప‌టికీ.. ఇప్పుడు ఆ యువ నేత‌కు ప‌ట్టం క‌ట్టేందుకు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు రెడీగా ఉన్నారు. అదే అమ‌లాపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి టీడీపీ నేతృత్వంలోని కూట‌మి పార్టీల అభ్య‌ర్థిగా గంటి మోహ‌న‌ చంద్ర‌ బాలయోగి (జీఎంసీ బాలయోగి) కుమారుడు హ‌రీష్ మాధుర్ పోటీ చేస్తున్నారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న పోటీ చేశారు. అయితే..అ ప్ప‌ట్లో వైసీపీ హవా, మ‌హిళా నాయ‌కురాలు చింత అనురాధ సెంటిమెంటుతో గంటి వార‌సుడు గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు.

అయితే.. ఇప్పుడు రెండు ర‌కాలుగా మాధుర్‌కు కాలం క‌లిసి వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పోటీ చేస్తున్నారు. అయితే.. ఆయ‌న ముందుగానే అస్త్ర శ‌స్త్రాలు వ‌దిలేశార‌నేటాక్ ఉంది. దీనికి అనేక కారణాలు. ఒకటి ఎలాగైనా అతన్ని కసి తీరా ఓడించాలని జనసైనికులు పట్టుదలగా ఉన్నారు. అలాగే రాపాక  త‌న‌కు, త‌న‌స్థాయికి మించిన సీటుగా ఎంపీసీటును భావిస్తున్నారు. దీంతో ప్రచారంలో ఇంకా స్పీడు అందుకోలేక పోతున్నారు. అంతేకాదు.. నిరాశ నిస్పృహ‌ల‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీలో ఇక్క‌డ ఊపు క‌నిపించ‌డం లేదు.

ఇంకోవైపు.. టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌ కూటమి అభ్యర్ధి, టీడీపీ నేత‌ గంటి హరీష్‌మాధూర్  ప్రచారంలో దూకుడు గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మండపేట, ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాలతో పాటు అమలాపురంలో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు.. జ‌న‌సేనలో యువ‌త‌ను క‌లుపుకొని పోతున్నారు. ఇక‌, సొంత పార్టీ టీడీపీలో అంద‌రూ గంటి వార‌సుడికే జై కొడుతున్నారు. దీనికి తోడు తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత‌.. గంటి కుటుంబం నుంచి రాజ‌కీయంగా ప్రాధాన్యం ల‌భించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఈ సారైనా గంటి కుటుంబాన్ని గెలిపించుకుని తీరాల‌న్న క‌సి.. ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో స్ఫ‌స్టంగా క‌నిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమికి సంబందించి సానుభూతి, జీఎంసీ బాలయోగి కుమారుడు కావడం  ఆయనకు కలిసొస్తున్నారు.  ఇంకో వైపు జ‌న‌సేన యూత్ ఓట్లు.. యువ నాయ‌కుడు అనే టాక్ కూడా గంటికి అనుకూలంగా మారాయి. మొత్తంగా చూస్తే.. అమ‌లాపురం స్థానంలో ఈ ద‌ఫా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.