టీడీపీ ప్రభుత్వం అప్పుడు హైదరాబాద్ వదిలింది అందుకేనా?

Chandrababu

ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు సజావుగా సాగాలంటే అక్కడి శాంతిభద్రతల మీద, వాటిని క్రమబద్ధీకరించే వ్యవస్థల మీద ఆ ప్రభుత్వానికి పూర్తి పట్టు ఉండాలి, పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని అమలుచెయ్యగల సిబ్బంది తమ అదుపులో ఉండాలి. అలా కాకుండా ఆ ప్రభుత్వం మరొకరిపై ఆధారపడితే ఎంత గొప్ప పాలకులైనా పాలన సజావుగా చెయ్యలేరు. ఇదే విషయంపై కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి పూర్తి అధికారాల్లేని ఢిల్లీ లాంటి చోట్లా తరచూ ఒక వ్యవస్థ మరొక వ్యవస్థతో గొడవ పడటం చూస్తూనే ఉంటాం.

2014లో ఆంధ్రప్రదేశ్ ను విభజించినప్పుడు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు నిర్ణయించింది. విభజన చట్టం సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, వాటిని పరిరక్షించే ప్రత్యేక అధికారాలు గవర్నర్ కు కల్పించింది. అప్పటి ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్ల మాజీ పోలీస్ అధికారి అయిన అప్పటి గవర్నర్ నరసింహన్ గానీ, ఆనాటి కేంద్ర ప్రభుత్వం గానీ ఈ విషయం మీద దృష్టి పెట్టలేదు. అప్పటి ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కొన్నిసార్లు దీనిమీద కేంద్రానికి వినతులు ఇచ్చినా వారు రాజకీయ కారణాలతో పెద్ద ఆసక్తి చూపలేదు. దానితో స్థానిక ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం రాజధానిలో శాంతిభద్రతల అంశం తన చేతిలోకి తీసుకుంది. రాష్ట్ర విభజన తరువాత టిఆర్ఎస్ పార్టీ గెలిచినా కేవలం బొటాబొటీ మెజారిటీతో సరిపెట్టుకుంది. దానితో గద్దెనెక్కిన మొదటి రోజునుండి, ప్రతిపక్షాలను, అధికారులని, మీడియాను తన చేతిలోకి తెచ్చుకోవడానికి అనేక రకాల పద్ధతులు అవలంభించింది. వాటిలో ఫోన్ టాపింగ్ అనే అంశం కూడా ముఖ్యమైనది. ఫోన్ టాపింగ్ తో అక్కడి ప్రతిపక్షాలను నిర్వీర్యం చెయ్యడం మొదలు పెట్టింది. అప్పుడు అసెంబ్లీలో మూడోవ పెద్ద పార్టీగా ఉండి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభల శక్తిగా ఉన్న టీడీపీని నిర్వీర్యం చెయ్యడానికి ఫిరాయింపులు ప్రోత్సహించడం మొదలు పెట్టింది అప్పటి అధికార పార్టీ. ఆక్రమంలో అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడి ఫోన్ కూడా టాప్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో జరిగిన ఒక ఎంఎల్సీ ఎన్నికల సందర్భంగా అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి తెలివిగా వలవిసిరి డబ్బుతో పట్టుకుని జైలు పాలు చెయ్యడం పెద్ద సంచలనం సృష్టించింది. ఆ సంఘటనలో అనేకమంది ఫోన్లు రికార్డ్ చేసి ఆ ఆడియోలు కూడా కొన్ని బయటపెట్టారు. అందులో ఆంధ్ర సిఎం ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే తో జరిపిన సంభాషణ ఆధారంగా దీనికి చంద్రబాబు సూత్రధారి అంటూ ప్రచారం చేసారు. దానితో ఫోన్ టాపింగ్ అంశం మరొకసారి బయటకు వచ్చింది. ఆంధ్ర ప్రభుత్వం ఫోన్ టాపింగ్ మీద విచారణ చేపట్టింది. అప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి రాజధానిలో విభజన చట్టప్రకారం సెక్షన్ 8 అమలు చెయ్యాలని, లా అండ్ ఆర్డర్ గవర్నర్ పర్యవేక్షించాలని గట్టిగా డిమాండ్ చేశారు. కారణాలేవైనప్పటికీ అప్పటి కేంద్రం, గవర్నర్ ఇంత జరుగుతున్నా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఢీ కొట్టుకుంటున్నా తమకు సంబంధంలేని విషయంలా కూర్చున్నారు.

అప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ వంటి తమ పాలసీ లు కొన్ని తెలంగాణ ప్రభుత్వం కాపీ చేసిందని, తాము సంప్రదిస్తున్న కంపెనీలు, పెట్టుబడులు మరికొన్నిటిని టాపింగ్ ద్వారా తెలుసుకుని తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోయిందనే అనుమానం ఉన్న ఆంధ్ర ప్రభుత్వం, ఎంఎల్సీ లకు కేసు విషయంలో ఫోన్ టాపింగ్ పై జరిపిన విచారణలో దానిమీద నిర్ధారణకు రావడం, గవర్నర్ సెక్షన్ 8 విషయంలో ఎన్నిసార్లు కోరినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం, కేంద్రం కూడా పట్టించుకోకపోవడం వంటి వాటితో హైదరాబాద్ నుండి ప్రభుత్వం పనిచేయడం ఏమాత్రం సురక్షితం కాదు, తమ ప్రభుత్వ రహస్యాలు, వివిధ పెట్టుబడుల వివరాలు గోప్యంగా ఉండటం కష్టం అనే విషయాన్ని గుర్తించింది. వెంటనే పరిపాలన ఆంధ్రకు తరలకపోతే పరిపాలన వివరాలన్నీ అప్పుడే విడిపడిన పొరుగు ప్రభుత్వం చేతిలోకి పోతాయనే విషయం గ్రహించారు. వాస్తవానికి దశలవారీగా ఆంధ్రాకు తరలి వెళ్లాలనే ఆలోచనతో అక్కడ కొన్ని భవనాలకు మరమత్తులు, సౌకర్యాలు కల్పించినా ఈ ఫోన్ టాపింగ్ తో సాధ్యమైనంత త్వరగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓటుకు నోటు కేసు వల్ల భయపడి వెళ్లిపోతున్నారని అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రాజకీయ పక్షాలు, ప్రతిపక్ష జగన్ రెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా వెనుకంజ వెయ్యక హైదరాబాద్ నుండి పరిపాలన అమరావతికి తరలించారు. అప్పుడు కనీస సౌకర్యాలు లేకున్నా, తన బస్ ని క్యాంపు ఆఫీస్ చేసుకుని మరీ కొన్ని రోజులు ప్రభుత్వం నడిపారు అప్పటి ముఖ్యమంత్రి.

ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారింది, అప్పటి అధికార ముఖ్యుల ట్రాప్ లో పడి బాధితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తీగ లాగితే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లే అడ్డంగా దొరికిపోతున్నారు, కొందరు విదేశాలకు పారిపోయారనే వార్తలు వస్తున్నాయి. అప్పటి అధికార ముఖ్యుల అదేశాల మేరకే తాము ట్యాపింగ్ చేశామని వారు చెబుతున్నట్టు మీడియాలో వినబడుతుంది. వీరు ఫోన్ టాప్పింగ్ తో నడిపిన దందాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే విస్తుపోవడం ప్రజల వంతు అయ్యుంది. వీటిని బట్టి చూస్తే అప్పుడు టీడీపీ ప్రభుత్వం అకస్మాత్తుగా హైదరాబాద్ వదలివెళ్లడంపై వారు చెప్పిన ఫోన్ ట్యాపింగ్ నిజమేనని ఇప్పటి పరిణామాలు సూచిస్తున్నాయి.

  • By శ్రీకాంత్.బి.సి