ఫోన్ ట్యాపింగ్ కేసు.. అసలు ఎవరీ తిరుపతన్న?

గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ నకు పాల్పడిన సంచలన ఆరోపణలు తెర మీదకు రావటం.. ఈ వ్యవహారంలోఇప్పటివరకు ముగ్గురు పోలీసు అధికారుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించటం తెలిసిందే. రెండు రోజుల క్రితం అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్న భుజంగరావు..తిరపతన్నలను రిమాండ్ చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన వివరాల మీద ఆరా పెరిగింది. అయితే.. తిరుపతన్నకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా మారటమేకాదు.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ను తెలుసుకుంటున్న వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పలు వివాదాస్పద ఉదంతాల్లో ఆయన పేరు ముడిపడి ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు.

ఒక సాధారణ సీఐగా షురూ అయిన తిరుపతన్న తక్కువ వ్యవధిలోనే పెద్ద స్థాయికి చేరుకోవటం చూస్తే ఆయన టాలెంట్ ఎంతన్నది ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు. మంచి మాటకారి కావటంతోపాటు అంగబలం.. అర్థబలం ఉన్న ఆయన జిల్లా స్థాయి అధికారుల్ని సైతం తనదైనశైలిలో ప్రభావితం చేసేవారని చెబుతున్నారు. ఈ కారణంగానే తాను కోరుకున్న చోట పోస్టులు సొంతం చేసుకునే సత్తా ఆయన సొంతమంటున్నారు.

2007లో సదాశివపేటలో సీఐగా పని చేస్తున్న సమయంలో ఒక చోరీ కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకురావటం.. లాకప్ డెత్ ఘటన చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమై.. సదాశివపేట పట్టణవాసులంతా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి స్టేషన్ ను తగలబెట్టిన ఘటన చోటు చేసుకుందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఉదంతం తర్వాత ఆయన్ను జిల్లా నుంచి బదిలీ మీద బయటకు పంపేశారు.

ఈ కేసుకు సంబంధించి మరకను చెరిపేసుకోవటం కోసం డీఎస్పీ హోదాలో మళ్లీ జిల్లాకు వచ్చారని చెబుతారు. లాకప్ డెత్ కేసును సెటిల్ చేసుకోవటంలో సక్సెస్ అయినట్లుగా సమాచారం. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం నయాం గ్యాంగ్ ఆగడాల్ని అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించటం తెలిసిందే. డీఎస్పీగా ప్రమోషన్ వచ్చిన కొద్దిరోజులకే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగిన పోలీస్ ఎన్ కౌంటర్ లో నయిం మరణించటం తెలిసిందే. నయిం డైరీలో తిరుపతన్న స్థానం రెండోదిగా చెబుతారు.

నయిం డైరీలోని అంశాలపై అప్పట్లో పోలీసు అధికారులు సీరియస్ గా ఫోకస్ చేసినా.. అందులో బడా రాజకీయ నాయకులు పలువురు ఉండటంతో ఆ కేసు మీద ఎక్కువ లోతుల్లోకి వెళ్లలేదని చెబుతారు. ఈ కారణంగా తిరపతన్న పెద్దగా ఫోకస్ కాలేదంటారు. సంగారెడ్డి డీఎస్పీగా పని చేసి ప్రమోషన్ మీద అదనపు ఎస్పీగా మారిన ఆయన తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం దొరకిపోయారన్న మాట వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లక తప్పలేదంటున్నారు. అతి కొద్ది మంది పోలీసు అధికారులకు ఉండే విచిత్రమైన మనస్తత్వం ఆయన సొంతమని.. ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా చేయటంకోసం ఎంతకైనా వెళ్లేవారంటున్నారు. మొత్తంగా తిరపతన్న బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.