వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్‌.. టీడీపీ కీల‌క నేత‌కు గేలం?

కీల‌క‌మైన ఎన్నికల ముంగిట వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్ వేసింద‌నే టాక్ వినిపిస్తోంది. విశాఖ‌పట్నం జిల్లాలో టీడీపీకి బ‌ల‌మైన గ‌ళంగా ఉన్న కీల‌క నేత బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తిని వైసీపీలోకి చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. టీడీపీలో సీనియ‌ర్ నేత అయిన బండారు.. పెందుర్తి టికెట్ ఆశించారు. అయితే, పొత్తుల్లో భాగంగా ఈ సీటును చంద్ర‌బాబు జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో బండారు తీవ్ర అసంతృప్తికి గుర్యయారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

దీనిపై ఆయ‌న రియాక్ట్ అవుతూ.. “నేను పార్టీ వీడుతున్నానని వస్తున్న వార్తలను మీడియాలో చూస్తున్నాను. ఈ వార్తలపై నా సమాధానం ‘నో’ కామెంట్‌” అని బండారు వ్యాఖ్యానించారు. అంతేకాదు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో చర్చలు జరుపు తున్నానని, వారి అభిప్రాయాల మేర‌కు న‌డుచుకుంటాన‌ని బండారు వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వైసీపీలోకి జంప్ చేయ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. వైసీపీ నుంచి బండారుకు పిలుపు వచ్చిందని.. ముఖ్యనేతలు కొందరు టచ్‌లోకి వెళ్లగా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని బండారు అనుచ‌రులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని.. ఈయనతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా సైకిల్ దిగుతారని టాక్ నడుస్తోంది. ప్ర‌స్తుతం వైసీపీ 175 అసెంబ్లీ సీట్లు ప్ర‌క‌టించేసింది. ఇక‌, 25 ఎంపీ స్థానాల్లో కేవలం ఒకే ఒక్క‌టి అన‌కాప‌ల్లిని పెండింగులో పెట్టారు. ఈ సీటును బండారుకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశాఖ రాజ‌కీయ వ‌ర్గాల‌లో ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి టికెట్ దక్కని వాళ్లతో బండారు సత్యనారాయణ మంతనాలు చేస్తున్నారు. వారందరినీ కూడా వైసీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం బండారును వైసీపీలోకి వెళ్లొద్దని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని.. అధినేత చంద్రబాబు తప్పకుండా న్యాయం చేస్తారని చెబుతున్నారు. బండారు సత్యనారాయణ మూర్తి.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు మామ వ‌ర‌స అవుతారు. బండారు కుమారుడు అప్పలనాయుడు కూడా టికెట్‌పై ఆశ‌ల‌తోనే గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా పార్టీ కార్యక్రమాల కోసం విస్తృతంగా శ్రమించారు. మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.