ఈ రోజు కోసం ఐదేళ్లుగా ఎదురు చూశా: చంద్ర‌బాబు ఎమోష‌న‌ల్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎమోష‌న‌ల్ అయ్యారు. ఐదేళ్లుగా తాను ఈ రోజు(ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న రోజు) కోస‌మే ఎదురు చూసిన‌ట్టు తెలిపారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా పార్ల‌మెంటు, ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఏపీలో మే 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఫ‌లితాలు మాత్రం అందరితో పాటే జూన్ 4న విడుద‌ల కానున్నాయి. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు ఎక్స్ వేదిక‌గా మెసేజ్ చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఐదేళ్లుగా ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది… జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది… ఇక పోలింగే మిగిలింది అని ట్వీట్ చేశారు. ఒక్క చాన్స్ ప్రభుత్వానికి ఒక నో చాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చింది అని చంద్రబాబు వివరించారు.

నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదాం అని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులేనని తెలిపారు. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తుండగా, జూన్ 4న కౌంటింగ్ జరగనుందని చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మ‌హిషాసుర పాల‌న‌కు ప్ర‌జ‌లు చ‌ర‌మ గీతం పాడాల‌న్నారు. ఈ రోజు కోస‌మే ఐదేళ్లుగా ఎదురు చూశా. రానే వ‌చ్చింది. ఇక‌, రెండు నెల‌లు అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.