నా ఎదుగుదలే నాకు శాపమైపోయింది: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

తాను అధికారంలోకి వ‌చ్చేందుకు పార్టీ పెట్ట‌లేద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. కేవలం ఒక ఆశ‌యం కోసమే తాను రాజ‌కీయ పార్టీ పెట్టిన‌ట్టు ఆయ‌న చెప్పారు. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న జెండా ఆవిష్క‌ర‌ణ చేశారు. అనంత‌రం మాట్లాడుతూ.. సామా న్యుడికి అండగా నిలవాలన్నదే తన అజెండా అని వివరించారు. నాడు కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపనలో అండగా నిలిచిన వ్యక్తులే ఇవాళ జనసేనకు మూల స్తంభాలయ్యారని తెలిపారు.

జనసేన పార్టీని స్థాపించిన‌ప్పుడు త‌న వెంట కేవ‌లం 150 మంది మాత్ర‌మే ఉన్నార‌ని, ఇప్పుడు చూస్తే. ఏకంగా 6.50 లక్షల మంది క్రియాశీలక సభ్యులు పార్టీని ముందుండి న‌డిపిస్తున్నార‌ని తెలిపారు. విధాన పరంగానే విభేదిస్తాను తప్ప… వైసీపీపై కానీ, జగన్ పై కానీ తనకు వ్యక్తిగత ద్వేషమేమీ లేదని పవన్ పేర్కొన్నారు. అయితే, మీరు మమ్మల్ని తొక్కేస్తామంటే మేమూ మిమ్మల్ని తొక్కేస్తాం అని హెచ్చరించారు.

“నేను ప్రపంచమంతటికీ తెలిసిన పాపులర్ నటుడినే కావొచ్చు. కానీ, నేను రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఆ పాపులారిటీ అధికారంలోకి బదిలీ కాదు. అందుకే నేను పాతికేళ్లు పనిచేయాలన్న లక్ష్యంతో వచ్చాను. అయితే అభిమానులు మాట పడరు. నేను మోడీ గారికి నమస్కారం చేస్తే… నువ్వు ఆయనకెందుకు నమస్కారం చేశావంటారు. మోడీ మహానాయకుడు. ఒక్కోసారి అభిమానం మనల్ని ఎదగనివ్వదు. వైసీపీ నేతలు నిన్ను తిడుతున్నారు. ఎందుకు వచ్చావు రాజకీయాల్లోకి అంటారు. నేను మీ కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం వచ్చాను. నా నేల ఇది, నా దేశం ఇది, నా సమాజం ఇది. మా ఇంట్లో వాళ్లు ఎందుకు పాలిటిక్స్? అన్నారు. నేనేమీ చేయకపోయినా దాడులు చేస్తుంటే ఏం చేయాలి? అని వారిని ప్రశ్నించాను.” అని ఒకింత భావోద్వేగంతో ప్ర‌సంగించారు.

“నా ఎదుగుదలే నాకు శాపమైపోయింది, మీ గుండెల్లో ఉన్న అభిమానమే నాకు శాపమైపోయింది. 2014 నుంచి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతున్నాం. జనసేన ఇప్పుడు గుర్తింపు ఉన్న పార్టీగా ఎదిగిం ది. 18 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చాయి. మనకు 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉండుంటే జనసేన స్థాయి మరోలా ఉండేది. కానీ ఆ రోజున నా వ్యూహాలు ఎవరూ అమలు చేయనివ్వలేదు. నేను వెళితే లక్షలాది మంది జనం వస్తారు. కానీ ఆ లక్షలాది మంది ప్రజలు లక్షలాది ఓటర్లు కారు. వారందరూ ఓట్లు వేస్తే పరిస్థితి వేరేగా ఉండేది” అని అన్నారు.

“2019లో 30 స్థానాల్లో పోటీ చేద్దామనుకున్నాను. కానీ అందరూ ఒత్తిడి చేయడంతో నిస్సహాయ పరిస్థితు ల్లో రాష్ట్రమంతా పోటీ చేయాల్సి వచ్చింది. దారుణం ఏంటంటే… ఆ సమయంలో నేను ఓడిపోతున్నా నన్న సంగతి నాకు తెలుసు. ఒకసారి యుద్ధంలోకి దిగాక ఓటమి, గెలుపు గురించి ఆలోచించకుండా యుద్ధమే చేయాలి. గాజువాకలో ఎలాగూ ఓడిపోతానని తెలుసు. ప్రచారం ముగించగానే అర్థమైంది భీమవరంలో కూడా ఓడిపోతున్నానని. రెండు చోట్ల ఓడిపోయినవాడికి దేశం మీద, సమాజం మీద ఇంత పిచ్చి మంచిదా? అనిపించింది” అని వ్యాఖ్యానించారు.