కొంద‌రు వ‌స్తున్నారు.. మ‌రికొంద‌రిని తెస్తున్నారు..!

పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సమ‌యం చేరువ అవుతున్న నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త పోక‌డ‌లు క‌నిపిస్తున్నాయి. కొందరు నేత‌లు తమంత‌ట తామే పార్టీలు మారేందుకు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. అయితే.. మ‌రికొంద‌రు మాత్రం వేచి చూస్తున్నారు. ఇలా వేచి చూస్తున్న వారిని పార్టీలే చొర‌వ తీసుకుని మ‌రీ వెళ్లి క‌లిసి.. పార్టీలో చేర్చుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అంటే.. ఒక ర‌కంగా.. ఇప్పుడు కొంద‌రు తమంత‌ట తామే వ‌స్తుండ‌గా.. మ‌రికొంద‌రిని నాయ‌కులే వెళ్లి తీసుకువ‌స్తున్నారు.

తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి స్వ‌యంగా వెళ్లి.. బీజేపీ నేతను పార్టీలో చేరాల‌ని ఆహ్వానించ‌డం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం ఆశించి జితేందర్ రెడ్డి భంగపడ్డారు. ఈ టిక్కెట్‌ను మాజీ మంత్రి డీకే అరుణకు కేటాయించారు. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ విష‌యాన్ని గ్ర‌హించిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఇలాంటి వారి విష‌యంలో జాప్యం చేయ‌డం మంచిది కాద‌ని అనుకుందో ఏమో.. వెంట‌నే ఇలాంటి వారి ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ.. ఆహ్వానాలు అందిస్తోంది. వ‌చ్చేయండి మేం చూసుకుంటాం.. అంటూ భ‌రోసా ఇచ్చేస్తోంది. ఇలానే జితేంద‌ర్‌రెడ్డి ఇంటికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి స్వయంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

దీంతో లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి జితేంద‌ర్ కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయిన‌ట్టే న‌ని భావిస్తున్నారు. బీజేపీ రెండో జాబితాను బుధ‌వారం సాయంత్రం విడుదల చేసింది. ఇందులో మహబూబ్ నగర్ ను డీకే అరుణకు కేటాయించింది. జితేందర్ రెడ్డి కూడా ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు. ఇక‌, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వ్య‌వ‌హారంపైనా కాంగ్రెస్ దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న‌కు గెలిచే అవ‌కాశం ఉంద‌ని హ‌స్తం నేత‌లు భావిస్తున్నారు. ఈనేప‌థ్యంలో ఆయ‌నను కూడా చేర్చుకుంటే ఒక సీటు రిజ‌ర్వ్ అయిన‌ట్టేన‌ని అంటున్నారు.