పవన్ పిఠాపురం.. వ‌ర్మ వెటకారం

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల‌లో తాను పోటీ చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. అదే.. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచితాను కూడా పోటీ చేస్తున్న‌ట్టు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

“మీకో బ్రేకింగ్ న్యూస్‌.. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా” అని రాంగోపాల్ వ‌ర్మ ట్వీట్ చేశారు. అయి తే.. ఆయ‌న ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నార‌నేది చెప్పలేదు. అంతేకాదు.. ఎందుకు పోటీ చేయాల‌ని భావి స్తున్న‌ట్టు కూడా వెల్ల‌డించలేదు. అయితే.. ప‌వ‌న్‌ను త‌ర‌చుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌ర్మ విమ‌ర్శిస్తూ ఉంటారు. ఆయ‌న విధానాల‌ను కూడా త‌ప్పుబడుతుంటారు. పార్టీకి క‌నీసం బూత్ స్థాయిలో నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు కూడా లేర‌ని పెద‌వి విరుస్తారు.

ఇలాంటి వ్య‌క్తి అనూహ్యంగా ప‌వ‌న్ పోటీ చేస్థానని ప్ర‌క‌టించిన స్థానం నుంచి ఆ వెంట‌నే తాను కూడా బ‌రిలో ఉన్నాన‌ని ప్ర‌క‌టించ‌డం వెనుక రాజ‌కీయంగా ఏదో సంచ‌ల‌నం సృష్టించేందుకేన‌ని తెలుస్తోంది. ఒక‌వేళ వైసీపీ ఈయ‌న‌కు టికెట్ ఇస్తుందా? అంటే.. ఎట్టి ప‌రిస్థ‌తిలోనూ టికెట్ ఇచ్చే అవ‌కాశం లేదు. సో.. ఎలా చూసుకున్నా ఆర్జీవీ ప్ర‌క‌ట‌న కేవ‌లం ఏదో ఒక విధంగా చ‌ర్చ‌కు దారితీయాల‌న్న వ్యూహం మాత్ర‌మే కనిపించేలా చేస్తోంది.

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్ ఎక్క‌డ నుంచి పోటీ చేస్తాడా? అని కొన్నాళ్లుగా పార్టీ ఎదురు చూస్తోంది. ఆయ‌న‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఓడించాల‌ని నిర్ణ‌యించున్న ద‌రిమిలా ప‌వ‌న్ పోటీ చేసే స్థానం కోసం వేచి ఉంది. ఇక‌, ఇప్పుడు పిఠాపురం అని తేలి పోయిన నేప‌థ్యంలో బ‌ల‌మైన కాపు నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభానికి అవ‌కాశం ఇచ్చే చాన్స్ క‌నిపిస్తొంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.