రెండో జాబితా రెడీ అయ్యిందా ?

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా రెడీ అయినట్లు సమాచారం. రెండో జాబితాను ప్రకటించేందుకు చంద్రబాబునాయుడు కసరత్తు దాదాపు పూర్తయిపోయిందట. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే గురువారం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి రెండో జాబితాను ప్రకటించే అవకాశముందని అంటున్నారు. పవన్ కూడా జనసేన తరపున పోటీచేయబోయే ఎనిమిది మంది అభ్యర్ధులను ప్రకటించే అవకాశముందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి బీజేపీ కూడా వీళ్ళతో కలుస్తుందో లేదో తెలీదు.

బీజేపీ పోటీ చేయబోయే నియోజకవర్గాలు, అభ్యర్థుల జాబితా విషయాన్ని చంద్రబాబుతో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చర్చించారట. నియోజకవర్గాలు, అభ్యర్ధులపై దాదాపు క్లారిటి వచ్చేసింది. అయితే ఈ జాబితాను షెకావత్ ఢిల్లీకి తీసుకెళ్ళి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాకు అందిస్తారట. ఆ తర్వాతే బీజేపీ అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని సమాచారం. పొత్తులో ఏ పార్టీ ఎన్నిస్ధానాల్లో పోటీచేయాలనే ముఖ్యమైన విషయం నిర్ణయమైపోయింది. తమకు దక్కిన నియోజకవర్గాల్లో ఎవరిని పోటీచేయించాలన్నది పూర్తిగా ఆయా పార్టీల ఇష్టమే.

కాబట్టి టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు రెండోజాబితాను ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ ఇంకా 50 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సుంది. మరి అలాగే జనసేన పోటీచేయబోయే 21 నియోజకవర్గాల్లో ఐదింటిని మాత్రమే పవన్ ప్రకటించారు. ఇంకా 16 సీట్లను ప్రకటించాల్సుంది. మరి టీడీపీ అయినా జనసేన అయినా రెండోజాబితాలో పూర్తి స్ధానాలను ప్రకటిస్తాయా లేదా అన్నది సస్పెన్సుగా మారింది.

అలాగే పార్లమెంట్ స్థానాల విషయం చూస్తే టీడీపీ 17 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది. బీజేపీ 6 సీట్లలోను జనసేన రెండు చోట్ల పోటీచేస్తున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలతో పోల్చితే పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయటమే చాలా కష్టం. ఎందుకంటే ఎంపీలుగా పోటీచేయబోయే అభ్యర్ధులు పూర్తిగా క్యాష్ పార్టీ అయ్యుండాలి. అప్పుడే ఎంఎల్ఏ అభ్యర్ధులకు ఎంపీ అభ్యర్ధులకు మధ్య సమన్వయం కుదురుతుంది. లేకపోతే మొత్తం ఎనిమిది మంది అభ్యర్ధులు ఇబ్బందులు పడాల్సుంటుంది. మరి చంద్రబాబు, పవన్ ఏమిచేస్తారో చూడాలి.