చంద్రబాబుపై మరో ఛార్జ్ షీట్

అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రూ.4,400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ కుంభకోణంలో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు పేరును చేర్చిన దర్యాప్తు సంస్థ.. ఆయనతో పాటు మాజీ మంత్రి నారాయణను ముద్దాయిగా పేర్కొంది. రాజధాని అమరావతి పేరిట భారీ భూ దోపిడీ జరిగిందని సీఐడీ ఆరోపించింది.

మొత్తం 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్లు పేర్కొన్న సీఐడీ.. క్యాపిటల్ సిటీ ప్లాన్ తో చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసినట్టు నిర్ధారించింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు స్కాం చేశారని పేర్కొంది. చంద్రబాబు, నారాయణతో పాటు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ లను ముద్దాయిలుగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబును ఏ-40గా సీఐడీ చేర్చింది. ఈ మేరకు సోమవారం అదనపు సీఐడీ మెమో దాఖలు చేసింది. మరో రెండు అసైన్డ్ భూముల కేసులో సీఐడీ అధికారులు ఒకే చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో రెండు కేసులకు ఒకే ఛార్జ్‌షీట్ ఎలా దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేసులు రెండు అసైన్డ్ భూములకు చెందినవేనని సీఐడీ న్యాయవాదులు చెప్పారు. ఈ కేసులో గతంలోనే మాజీమంత్రి నారాయణను నిందితుడిగా చేర్చారు.

ఎన్నికల నోటిఫికేషన్‌కు 3 రోజులు ముందు ప్రభుత్వం చార్జిషీట్ వేసిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబుపై కక్షతోనే అని పేర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబును మరో కేసులో చేరుస్తూ మండిపడుతున్నారు. న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని టీడీపీ నేతలు అంటున్నారు.