ఈ సారి జ‌గ‌న్ పంచ్‌లు ఇవే!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. సిద్ధం స‌భ‌ల‌లో మ‌హాభారతంలోని పేర్ల‌ను, ఘ‌ట్టాల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తున్న విష‌యం తెలిసిందే. తొలి స‌భ‌లో అర్జునుడు, అభిమ‌న్యుడు పేర్లు ప్ర‌స్తావించ‌గా, రెండో స‌భ‌లో దుర్యోధ‌నుల గుంపు అని ప్ర‌తిప‌క్షాల‌ను ఎండ‌గ‌ట్టారు. ఇక‌, మూడో స‌భ‌లో మ‌య స‌భ‌, మాయా జూదం గురించి ప్ర‌స్తావించారు. ఇక‌, తాజాగా శ‌కుని, పాచిక‌లు, జ‌మ్మిచెట్టు, కురుక్షేత్రం వంటివాటిని ప్ర‌స్తావించారు. జమ్మిచెట్టు మీద దాచిన ఓటు అనే ఆయుధాన్ని బయటకు తీసి.. మీ అభివృద్ధిని అడ్డుకునేందుకు సిద్ధ‌మైన వారిపై ప్ర‌యోగించాలి అని తాజాగా జ‌గ‌న్ పిలుపునిచ్చారు.

ఏపీలో జరగబోతున్న సంగ్రామంలో పేదవాడికి అండగా నిలిచేందుకు అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. జగన్ ను ఓడించేందుకు కూటమి, జగన్‌ను గెలిపించేందుకు మీరు చేస్తున్న పోరాటంలో అంతిమ విజయం తమదేనన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో తాజాగా నిర్వహించిన సిద్ధం భారీ బహిరంగ సభలో పొల్గొన్న సీఎం జగన్.. ఎన్నికల కోసం బీజేపీ, జనసేన పార్టీలతో చంద్రబాబు పెట్టుకుంటున్న పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలతో పొత్తుగా ఎన్నికలకు వెళ్తుంటే, చంద్రబాబు మాత్రం వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నేను సింహం. సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తా అని జ‌గ‌న్ చెప్పారు.

జమ్మిచెట్టు మీద దాచిన ఓటు అనే ఆయుధాన్ని బయటకు తీసి, మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వారిపై ప్రయోగిం చాల్సిన సమయం వచ్చిందన్నారు. చంద్రబాబు వెంట ఉన్నట్లు నటించే పొలిటికల్ స్టార్లు తన వద్ద లేరంటూ జ‌న‌సేన అధినేత‌ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఒంటరిగానే ఎన్నికలు వెళ్తున్న తనకు ఉన్నది కేవలం ప్రజా మద్దతు అని, వారే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ పేర్కొన్నారు. జనసేనతో పాటు చంద్రబాబు జేబులో మరో రాజకీయ పార్టీ ఉందని సెటైర్లు వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీలలో సైన్యాధిపతులు తప్ప‌, సైన్యమే లేదని ఎద్దేవా చేశారు.

గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు, తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలు, ప్రజల చేతిలో చిత్తుగా ఓడిన పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్‌ను ఓడించేందుకు వస్తున్నాయని చెప్పారు. 5 కోట్ల ప్రజల అండదండలతో ఎన్నికలకు మేం సిద్ధమని వైసీపీ చెబుతుంటే.. అక్కడ అర డజను పార్టీలతో పొత్తులు, ఎత్తులు, జిత్తులతో రాజకీయాలు చేస్తున్నారు. జాతీయ రాజకీయాలను తాను ఏలానని, స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించినట్లు చంద్రబాబు చెప్పుకునేవారు. కానీ ఏపీలో వైసీపీ చేసిన మంచి, ప్రజా బలం ముందు నేరుగా ఎదుర్కోలేక.. దత్తపుత్రుడుతో కలిసి ఢిల్లీకి వెళ్లి జాతీయ పార్టీ నేతల ముందు చంద్రబాబు మోకరిల్లారు. జగన్ మేలు చేయకపోతే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు. అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.