వైసీపీ 11వ జాబితా.. రాపాక‌కు ఎంపీ సీటు

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న సీఎం జగన్.. వివిధ సర్వేల ఆధారంగా నేతలకు టికెట్లు ఖరారు చేస్తున్నారు. కొంతమంది సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరిస్తుండగా.. వారి నియోజకవర్గాల్లో వేరేవారిని ఇంచార్జ్‌లుగా నియమిస్తున్నారు. ఇక మరింతకొంతమంది ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గాలకు షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తూ 10 జాబితాలు విడుదల చేయగా.. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక‌ 11వ జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఇందులో మూడు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను ప్రకటించారు.

తాజా జాబితాలో రెండు పార్లమెంట్, ఒక్క అసెంబ్లీ స్థానానికి సమన్వయకర్తలను నియమించారు. కర్నూలు పార్లమెంట్ ఇంచార్జ్‌గా బీవై రామయ్య, అమలాపురం లోక్‌సభ స్థానం ఇంచార్జ్‌గా ప్ర‌స్తుతం రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్సీ నేత‌ రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్‌గా గొల్లపల్లి సూర్యారావులను నియమించారు. దీంతో కలిపి ఇప్పటివరకు 11 జాబితాల్లో నియోజకవర్గ ఇంచార్జ్‌లను ప్రకటించారు. వైసీపీకి చెందిన కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలలో చేరారు.

ఈ జాబితాల ద్వారా ఖాళీ అయిన స్థానాలకు ఇంచార్జ్‌లను నియమిస్తున్నారు. ఇంచార్జ్‌లకే దాదాపు వచ్చే ఎన్నికల్లో సీటు ఖరారు చేసే అవకాశముంది. సీటు దక్కని నేతలు అసంతృప్తితో వేరే పార్టీలలో చేరుతున్నారు. దీంతో ఇటీవల టీడీపీ, జనసేన లోకి వైసీపీ నుంచి వలసలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన 11 జాబితాల్లో 75 అసెంబ్లీ, 23 ఎంపీ స్థానాలను వైసీపీ ఇంచార్జ్‌లను ప్రకటించింది. 175కి 175 స్థానాలు గెలుచుకోవాలని పదే పదే చెబుతున్న జగన్.. రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఐ ప్యాక్‌తో పాటు వివిధ సర్వే సంస్థల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటు న్నారు.

గెలుపు అవకాశాలు ఉండే నేతలకు మాత్రమే టికెట్లు ప్రకటిస్తున్నారు. లేకపోతే టికెట్లు ఇచ్చేది లేదని నేరుగా చెప్పేస్తున్నారు. టికెట్ దక్కని నేతలకు పార్టీలో కీలక పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. కానీ టికెట్ దక్కలేదనే అసంతృప్తితో నేతలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నష్టం జరగుతుందని పార్టీ శ్రేణులు ఆందోనన చెందుతున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.