ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్న రేవంత్

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. కారణం ఏమిటంటే పదేళ్ళ కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణలు చేయిస్తుండటమే. మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల డొల్లతనంపై కేంద్ర ప్రభుత్వం తరపున నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం విచారణ మొదలు పెట్టింది. ఇప్పటికే పై ప్రాజెక్టుల్లోని నాణ్యత ఎంత నాసిరకంగా ఉందో బయటపడింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రాజెక్టుల నాణ్యతంతా డొల్లేనని రిపోర్టిచ్చున్నారు.

అయినా సరే ప్రాజెక్టులను పరిశీలించమని, మరమత్తులకు మార్గాలు చెప్పమని, రివైజ్డ్ అంచనాలు చెప్పమని కేంద్ర ప్రభుత్వంలోని అథారిటీని ఆహ్వానించింది. దాంతో ఆరుగురు సభ్యుల బృందం ప్రాజెక్టులను పరిశీలిస్తోంది. ఈ పరిశీలనలో డెఫినెట్ గా నాణ్యత లోపాలపైన రిపోర్టివ్వటం ఖాయం. అప్పుడు కేసీయార్ హయాంలో ప్రాజెక్టులను పర్యవేక్షించిన వారందరిపైనా కేసులు పడుతుంది. అలాగే ఫార్ములా 1, ఔటర్ రింగురోడ్డులో జరిగిన భారీ అవినీతిపైన కూడా విచారణ చేయిస్తోంది. దీంతో హెచ్ఎండీఏ ఆపీసులో విజిలెన్స్ ఉన్నతాధికారులు సంబంధిత ఫైళ్ళను స్వాధీనం చేసుకున్నారు.

ఇక గొర్రెల స్కామ్ పైన ఏసీబీ అధికారులు, ధరణిలో అవకతవకలు, అక్రమాలపైన కూడా విజిలెన్స్ ఉన్నతాధికారులు దాడులు చేసి ఫైళ్ళను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైన పోలీసు శాఖలోని ఉన్నతాధికారులే విచారణ మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు శాఖల్లో విచారణలు చేయిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అండ్ కో చెప్పినట్లు అధికారులు అడ్డదిడ్డంగా వ్యవహరాలు నడిపినట్లు అర్ధమవుతోంది. నియమ, నిబంధనలకు నీళ్ళొదిలేసి తమిష్టారాజ్యంగా చేసుకున్న విషయం బయటపడుతోంది.

అందుకనే ఇఫుడు విచారణ జరిపిస్తుంటే అప్పటి ఉన్నతాధికారులందరు ఇపుడు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. తమకు ఆదేశాలిచ్చి పనులు జరిపించుకున్న నేతలు హ్యాపీగానే ఉండి తాము మాత్రం తగులుకోబోతున్నట్లు ఫీలవుతున్నారు. హెచ్ఎండీఏలో చక్రంతిప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఫార్ముల కార్ రేసు ఏర్పాట్లపై సమాధానం చెప్పిన విధానమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటిమంత్రి ఫోన్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తాను రు. 55 కోట్లు ఖర్చుపెట్టినట్లు చీఫ్ సెక్రటరీకి సమాధానమిచ్చారు. అప్పటిమంత్రి అంటే ఎవరో అందరికీ తెలుసు. మంత్రి ఫోన్లో ఆదేశాలిస్తే అర్వింద్ రు. 55 కోట్లు ఎలా ఖర్చుపెట్టారన్నది ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇలాంటి వాళ్ళందరు ఇపుడు తగులుకుంటామనే భయంతో టెన్షన్ పడిపోతున్నారు.