హ‌త విధీ.. కేసీఆర్‌కు ఎంత క‌ష్టం!

విధి అంటే ఇలానే ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ఇప్పుడు ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. విది ఎంత బ‌లంగా ఉంటుందో అర్ధం అవుతుంది. “ఏ ఎస్పీ.. బీఎప్పీనా.. ఎస్పీ లేదు.. పాడు లేదు ఊకోవ‌య్యా.. గ‌ది కూడ పార్టీయేనా?.. ఎవ‌రు..? ప్ర‌వీణా? గాయ‌నెవ‌రు? ఎట్టుంట‌డు? ఏం చేస్త‌డు.. వీళ్లంతా ఆయారాం.. గ‌యారాంలే” – అని గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి సీఎంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు గుర్తుండే ఉంటాయి. బీఎస్పీని, ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్న ప్ర‌వీణ్ కుమార్‌ను కూర‌లో క‌రివేపాకు మాదిరిగా కేసీఆర్ తీసేశారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

క‌ట్ చేస్తే.. మూడు మాసాలు కూడా కాకుండా.. ప్ర‌వీణ్‌కుమార్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. బీఎస్పీతో జ‌ట్టుకు చేతులు క‌లిపేందు కు రెడీ అయ్యారు. అంతేకాదు.. టికెట్ల పంప‌కాల‌పై కూడా.. ఆయ‌న చ‌ర్చించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు.. హ‌త విధీ కేసీఆర్‌కు ఎంత క‌ష్టం అనే మాటే అంటున్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉండ‌డం.. ఎక్క‌డిక‌క్క‌డ బీఆర్ఎస్‌పై ఇంకా సానుకూల‌త వ‌చ్చిన వాతావ‌ర‌ణం క‌నిపించ‌క‌పోవ‌డం కార‌ణంగా.. బీఆర్ఎస్ అదినేత కేసీఆర్‌.. అందివ‌చ్చిన కొమ్మ‌ను ఆస‌రా చేసుకుంటున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

బీఎస్పీతో పొత్తు దాదాపు ఖారైన‌ట్టు బీఆర్ ఎస్ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ఎస్సీ పార్ల‌మెంటు స్థాన‌మైన‌ నాగర్ కర్నూల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని బీఎస్పీకి కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పని చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న ద‌రిమిలా బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ టికెట్ కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. అదేస‌మ‌యంలో లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు ఉండ‌డంతోపాటు.. సీట్ల‌ను కూడా పంచుకోనున్నారు. రెండు నుంచి మూడు స్థానాల‌ను బీఎస్పీకి కేటాయించే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక‌, బీఎస్పీ వ‌ర్గాలు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్సీ రిజర్వుడ్ అయిన నాగర్ కర్నూల్ నుంచే బరిలోకి దిగుతారని అంటున్నారు.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌పై స్ప‌ష్ట‌త‌

మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఖరారు చేశారు. ఈ మేరకు కేసీఆర్ ప్రకటన చేశారు. సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి కేసీఆర్ మరోసారి ఆయ‌న‌కే అవకాశం ఇచ్చారు. 2019 మే నెలలో జరిగిన 17వ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీగా విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డి.కె అరుణపై 56,404 ఓట్ల మెజారిటీతో శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు.