బీసీలు తొక్కిపట్టి నార తీస్తారు: ఎంపీ రామ్మోహన్

మంగళగిరి సమీపంలో నాగార్జున వర్సిటీ వద్ద టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, పలువురు టీడీపీ నేతలు, జనసేన నేతలు హాజరయ్యారు. ఈ సభకు లక్షలాది మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు, బీసీ సోదరులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ సభా వేదికపై వైసీపీ మాజీ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. జయరాంకు కండువా కప్పి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని జయరాం అన్నారు. బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని, చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. ఈ సభలో టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పీచ్ కు సభ దద్దరిల్లిపోయింది. ఎంతోమందికి పల్లకీలు మోసిన బీసీలను పల్లకీ ఎక్కించింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

1982లో ఏపీలో ఎక్కడ ఏ కులం ఉందో తెలియదని, వారిని వెదికి వెదికి అటు పార్లమెంటుకు, ఇటు అసెంబ్లీకి పంపించిన ఘనత టీడీపీది, అన్నగారిదని చెప్పారు. కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ జీవితానికి ఎన్టీఆర్ పునాది వేస్తే..దానిపై తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని చెప్పారు.

బీసీల కోసం చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, 2014 నుంచి 2019 వరకు విద్య, ఉపాధి పరంగా కోట్ల రూపాయలతో అనేక పథకాలు తీసుకువచ్చారన్నారు. రూ.3,700 కోట్ల మేర బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు అందించి బీసీలకు చేయూతనిచ్చింది చంద్రబాబేనని చెప్పారు.

అయితే, ఒక్క అవకాశం అంటూ 2019లో దుర్మార్గుడు జగన్ అధికారంలోకి వచ్చాడని, దాంతో అత్యధికంగా నష్టపోయింది బీసీలేనని చెప్పారు. రూ.74 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దుర్మార్గుడు జగన్ అని, బీసీలకు సంబంధించిన అనేక పథకాలను ఆపేశాడని ఆరోపించారు.
బీసీలకు 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని జగన్ బడాయి కొట్టుకుంటున్నాడని, బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల వద్దకు బీసీ సోదరులు వెళితే కప్పు టీ ఇవ్వడానికి కూడా నిధులు లేని పరిస్థితి అని ఎద్దేవా చేశారు.

బీసీలు నమ్మితే ప్రాణం ఇస్తారని, నమ్మకద్రోహం చేస్తే తొక్కిపట్టి నార తీస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. నా బీసీ అనే అర్హత జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్యానల్ స్పీకర్ అయ్యే అవకాశం దక్కితే… లోక్ సభలో మిథున్ రెడ్డిని ప్యానల్ స్పీకర్ చేశారని ఆరోపించారు. రాజ్యసభలో ప్యానల్ స్పీకర్ అవకాశం వస్తే విజయసాయిరెడ్డికి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే టీడీపీకి వస్తే ప్యానల్ స్పీకర్ గా కాదు, ఏకంగా స్పీకర్ గానే దళిత బిడ్డ బాలయోగిని కూర్చోబెట్టిందని గుర్తు చేశారు. ఎర్రన్నాయుడును కేంద్ర మంత్రిని చేసింది టీడీపీ అని అన్నారు.