సర్వేలకే అత్యంత ప్రాధాన్యతిస్తున్నారా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు తొందరలోనే రెండో జాబితాను రిలీజ్ చేయబోతున్నారు. మరో వారంలోనే 30 మంది అభ్యర్ధుల పేర్లుండచ్చని పార్టీవర్గాల సమాచారం. దాదాపు వారంరోజుల క్రితం రిలీజ్ చేసిన మొదటిజాబితా పార్టీలో కలకలం రేపింది. ఎందుకంటే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గంటా శ్రీనివాసరావు, బోడె ప్రసాద్, పల్లా శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి 30 మంది సీనియర్లకు టికెట్లు దక్కలేదు. దక్కలేదంటే పై నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో టికెట్లు ఎవరికి దక్కుతుందో అనే అయోమయం పెరిగిపోతోంది.

ఈ నేపధ్యంలోనే తొందరలో రిలీజవ్వబోయే రెండో జాబితా విషయమై సీనియర్ తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతమంది సీనియర్లకు టికెట్లు దక్కకపోవటంలో రెండు కారణాలు కనబడుతున్నాయి. మొదటిదేమో జనసేనతో పొత్తు పెట్టుకోవటం. రెండో కారణం సర్వేలు. గడచిన నాలుగేళ్ళుగా టీడీపీ తరపున రాబిన్ శర్మ బృందం అన్నీ నియోజకవర్గాల్లోను ఒకటికి పదిసార్లు సర్వేలు చేస్తున్నారు. పార్టీ గెలుపోటమిపైనే కాకుండా ఏ అభ్యర్ధులు పోటీచేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటుందనే విషయంపైన కూడా సర్వే జరుగుతోంది.

ఈ సర్వే ఆధారంగా మాత్రమే చంద్రబాబు టికెట్లను ఫైనల్ చేస్తున్నారని పార్టీవర్గాల సమాచారం. సోమిరెడ్డినే ఉదాహరణగా తీసుకుంటే సర్వేపల్లిలో గడచిన ఐదుఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నారు. ఇపుడు కూడా టికెట్ ఇవ్వాలా అన్న ప్రశ్న పార్టీ నేతల నుండే బలంగా వినిపిస్తోంది. అలాగే తునిలో యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు నాలుగు ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. గంటా శ్రీనివాసరావు ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని మార్చేస్తారు. కాబట్టి ఇపుడు గంటాకు పోటీచేయటానికి అసలు నియోజకవర్గమే లేకుండా పోయింది.

ఇలాంటి అనేకమంది సీనియర్లకు చంద్రబాబు టికెట్లు ప్రకటించలేదంటే అందుకు కారణం సర్వేలే అని అర్ధమవుతోంది. ఇప్పుడు కూడా చంద్రబాబు సర్వేలు చేయిస్తునే ఉన్నారు. అందుకనే ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైతే టికెట్లు ప్రకటించిన నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ మార్చేస్తానని వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఒకపుడు సీనియర్లతో మాట్లాడి టికెట్లను ఫైనల్ చేసిన చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో మాత్రం సర్వేలపైన గట్టిగా ఆధారపడ్డారని అర్ధమవుతోంది. కాబట్టి ప్రకటించబోయే తదుపరి జాబితాలు కూడా సర్వేల ఆధారంగానే ఉంటుందనటంలో సందేహంలేదు.