ఫస్ట్ లిస్ట్ పై చంద్రబాబు ఫస్ట్ కామెంట్

టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అభ్యర్థుల జాబితాపై ఎన్నడూ చేయనంత కసరత్తు చేశామని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఈ జాబితాను రూపొందించామని చంద్రబాబు అన్నారు. జగన్ వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

సామాన్యులు మొదలు తనతో పాటు పవన్ కళ్యాణ్ వరకు వైసీపీ అరాచకాలను భరించామని, రాష్ట్రాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని చంద్రబాబు చెప్పారు. కోటి మంది అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే జాబితాను వెల్లడించామని చంద్రబాబు అన్నారు. అన్ని కోణాల్లో విశ్లేషించి అభ్యర్థులను వడపోత చేశామని, మంచి అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు. ఈ జాబితాలో ఉన్న 23 మంది తొలిసారి పోటీ చేస్తున్నారని, 28 మంది పోస్టు గ్రాడ్యుయేట్లున్నారని, 51 మంది గ్రాడ్యేయేట్లున్నారని చంద్రబాబు అన్నారు.

ఇక, ఎర్రచందనం స్మగ్లర్లను వైసీపీ అభ్యర్థులుగా నిలబెట్టిందని, రౌడీలను రాష్ట్రం మీదకు వదులుతోందని ఆరోపించారు. టీడీపీ-జనసేన కూటమి ఏర్పడిన వెంటనే వైసీపీ ఓటమి ఖాయమైందని చంద్రబాబు అన్నారు . 5 కోట్ల ప్రజలు ఒక పక్క… ధన బలం రౌడీయిజంతో ఎన్నికల బరిలోకి దిగుతున్న వైసీపీ మరోపక్క అని చంద్రబాబు అన్నారు. తన దగ్గర డబ్బు లేదని, కానీ రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల కమిట్మెంట్ ఉందని చంద్రబాబు చెప్పారు. వాలంటీర్లను అడ్డుపెట్టుకొని రౌడీయిజం చేసి వైసీపీ గెలిచే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు.